జిల్లాలోని నూజివీడు జమీలోని రెవెన్యూ డివిజన్లో పడిముక్కల, ఉయ్యూరు, హనుమాన్ జంక్షన్, పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత మెట్టప్రాంతం అంతర్భాగంగా ఉండేది. 1990ల వరకు జమీ రాజులుగా గుర్తింపు ఉన్న మేకా ఆర్ అప్పారావు ఇక్కడ నిశ్వార్థ సేవలకు అంకితంగా పనిచేశారు. ప్రజల నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారంటే.. తిరుగులేని రాజకీయనేతగా ఎదిగారంటే.. వారికి ప్రజల్లో ఉన్న అభిమానం.. వారు ప్రజలకు చేసిన సేవ ఎలాంటివో చెప్పకనే చెబుతాయి. ఇక, అప్పారావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తర్వాత అదే జమిందార్ వంశానికి చెందిన మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కూడా రాజకీయ అరంగేట్రం చేసి.. తిరుగులేని నాయకుడిగా.. ముఖ్యంగా ప్రజల పాలిట పెన్నిధిగా వన్నెలీనారు.
ఆదిలో మేకా వెంకట ప్రతాప్ అప్పారావు.. టీడీపీలో ఉండేవారు. అయితే.. 1999లో టీడీపీ నుంచి టికెట్ రాకపోవడంతో నూజివీడు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి 40 వేల ఓట్లు సాధించారు. ఆయన ఓడిపోయినా ఆయనకు వచ్చిన ఓట్లే ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఏంటో చాటి చెప్పాయి. నూజివీడు రాజకీయ చరిత్రలోనే ఇది పెద్ద రికార్డు. ఇక, ఆ తర్వాత ఆయన 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి సుమారు 24 వేల భారీ మెజారిటీ తో విజయం సాధించి.. నూజివీడు పరిధిలో తిరుగులేని మెజారిటీ సాధించిన నాయకుడిగా రికార్డు సొంతం చేసుకున్నారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014లో వైసీపీలోకి వచ్చారు. పార్టీ అధికారంలోకి రాకపోయినా.. ఆయన మాత్రం విజయం సాధించారు.
గత ఎన్నికల్లోనూ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు విజయం దక్కించుకుని ప్రజల మనిషిగా చిరస్థాయి గుర్తింపు పొందారు. ఇలా రెండున్నర దశాబ్దాలుగా ఆయన నూజివీడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. నూజివీడు చరిత్రలోనే ప్రతాప్ టైంలో జరిగిన అభివృద్ధి ఎప్పుడూ జరగలేదు. పమిడిముక్కల నుంచి తిరువూరు వరకు అనేక దేవాలయాలకు, విద్యాసంస్థలకు విరాళాలు ఇచ్చారు. సొంత విద్యాసంస్థలు స్థాపించి.. విద్యాసుగంధాలు అందిస్తున్నారు. ఎంఆర్ అప్పారావు ఐదు సార్లు.. మేకా ప్రతాప్ అప్పారావు.. 1999 నుంచి రెండున్నర దశాబ్దాలుగా మూడుసార్లు విజయాలు సాధిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఈ కుటుంబం నుంచి కొత్త తరం వారసుడిగా.. యువ నాయకుడు.. మేకా వెంకట వేణుగోపాల అప్పారావు (చంటి నాయన) ప్రజల మధ్యకు వచ్చారు.
యువ నాయకుడిగా వేణుగోపాల అప్పారావు ఉరఫ్ చంటినాయన దూసుకుపోతున్నారు. ఎవరికి ఏం కావాలన్నా.. నేనున్నాంటూ ముందుకు వస్తున్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా ఆయన గుర్తింపు పొందారు. నూజివీడును అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉండడంతోపాటు.. రాజకీయంగా తనదైన శైలిలో ప్రజలకు చేరువ అవుతున్నారు. కృష్ణాజిల్లా వైసీపీ యువ నాయకుల్లో తనకంటూ.. గుర్తింపు తెచ్చుకున్నారు.
తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నా చంటినాయన తెరవెనక రాజకీయ వ్యూహాలు పన్నడంతో పాటు అటు మున్సిపాల్టీలో కావచ్చు.. ఇటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా.. ఎక్కడ ఏ అసంతృప్తి తలెత్తినా వ్యూహాత్మకంగా పరిష్కరిస్తున్నారు. గత 15 ఏళ్ల నుంచే నూజివీడు మునిసిపాల్టీలో అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి చైర్మన్లు, వైఎస్ చైర్మన్ల ఎంపిక అంతా చంటినాయన కంట్రోల్లోనే ఉంటాయి. రాజకీయంగా ఎవరిని ఎలా ? దారికి తెచ్చుకోవాలో ఆయనకే తెలుసని కూడా నూజివీడు పొలిటికల్ టాక్ ?
భవిష్యత్తు రాజకీయాల్లో ప్రతాప్ వారసుడిగా ఆయన దూసుకుపోతున్నారు. కాలం కలిసొస్తే వచ్చే ఎన్నికల్లోనే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో నూజివీడు ప్రజలు చంటినాయన ప్రత్యక్ష రాజకీయాల ఎంట్రీపై ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. మరి చంటినాయన తెరవెనక రాజకీయాలు వదిలేసి ప్రత్యక్ష పొలిటికల్ తెరపై ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో ? చూడాలి.