అయితే ముఖ్యంగా చాలా మంది యువకులు ఆన్ లైన్ బెట్టింగ్ మోజులో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇలా తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. కొందరు తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లితండ్రుల ఆశలు.. ఆశయాలను తుంచివేస్తూ వారికి తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో క్రికెట్ బెట్టింగ్కు బానిసగా మారిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం రాళ్లబూదుగురు గ్రామానికి చెందిన కిరణ్ కుప్పం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చుట్టూ ఉన్న విద్యార్థుల్లో కొందరు బెట్టింగ్ కడుతూ సులభమైన మార్గంలో డబ్బు సంపాదించడం గమనించాడు. తాను బెట్టింగ్ చేస్తే అధికంగా డబ్బులు వస్తాయని భావించి జూదానికి అలవాటు పడ్డాడు.
అయితే తొలుత బాగానే అనిపించడంతో అందులో డబ్బులు ఎక్కువగా పెట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే వందలు వేలుగా మారాయి. అయితే తొలుత వచ్చిందని ఆనందపడ్డ కిరణ్.. తర్వాత నష్టాలను చవిచూశాడు. పూర్తిగా అప్పులో కూరకుపోయాడు. ఈ విషయం తెలిసేసరికి జరగాల్సింది జరిగిపోయింది. ఇక, చివరకు కిరణ్ తీవ్ర మానసకి వేదనకు లోనయ్యాడు. కొద్ది రోజులుగా స్నేహితులతో కూడా సరిగా మాట్లాడం లేదు. మరోవైపు బెట్టింగ్ చేసిన అప్పుల వేధింపులు తట్టుకోలేకపోయాడు.
ఈ తరుణంలోనే శనివారం ఉదయం ఇన్స్టాగ్రామ్లో తనలాగా ఎవరూ బెట్టింగ్ చేయకండి అంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశాడు. బెట్టింగ్ వల్ల జీవితాలను చిదిమేసుకోకండి అని కోరాడు. ఈ పోస్ట్ చేసిన 8 గంటల తర్వాత కుప్పం మండలం బంగారునత్తం రోడ్డులోని మామిడి తోటలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.