ప్రభుత్వం కావాలనే కరోనా కేసులు, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తుందేమో అన్న అనుమానం చాలా మందిలో ఉంది. అయితే ఇదే విషయాన్ని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బయటపెట్టింది వాషింగ్టన్కు సంబంధించిన సంస్థ. కరోనా మరణాలపై ప్రభుత్వాలు విడుదల చేస్తున్న గణాంకాలు తప్పుల తడకేనని.. వాస్తవ గణాంకాలు అంతకు రెండు రెట్లు ఎక్కువగా ఉండి ఉంటాయని అమెరికాకి చెందిన సంస్థ ఓ షాకింగ్ రిపోర్టు విడుదల చేసింది.
ఇంతకీ ఆ సంస్థ ఏంటంటారా.. అదే వాష్టింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ సంస్థ. కరోనా మరణాలను అనేక దేశాలు తక్కువగా చూపాయని ఈ సంస్థ అధ్యయనం చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా దేశాలు ప్రకటించిన మరణాల కంటే కరోనా మరణాలు రెండు రెట్లు ఎక్కువగా ఉండొచ్చని వాష్టింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా వేస్తోంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, రష్యాలతో పాటు భారత్ కూడా కరోనా మరణాలను తక్కువ చేసి చూపి ఉండొచ్చంటోంది.
ఇండియా విషయానికి వస్తే.. దాదాపు 4.3 లక్షల మరణాలను తక్కువగా చూపించారని ఈ సంస్థ భావిస్తోంది. ఇండియాలోనే కాదు అమెరికాలోనూ మరణాల సంఖ్య తక్కువగా చూపినట్లు ఈ అధ్యయనం చెబుతోంది. అమెరికాలో సుమారు 3.4 లక్షల మరణాలను తగ్గించి చూపించారట. ఇక రష్యాలో సుమారు 5.93 లక్షల మరణాలను రష్యా తక్కువగా చూపినట్లు ఈ సంస్థ స్టడీ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల డేటాను అధ్యయనం చేసినట్లు ఈ సంస్థ చెప్పుకుంటోంది.