కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ గురువారం రాత్రి దాదాపు గంటన్నర సేపు భేటీ అయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలను సీఎం హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకు వచ్చారు. ఏపీలో కొత్తగా నిర్మించనున్న మెడికల్‌కాలేజీలకు మంజూరు, అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్ర విభజన తర్వాత, ఏపీలో మహానగరాలు లేవని.. అందుకనే కొత్తగా 13 మెడికల్‌కాలేజీల నిర్మాణాన్ని మొదలుపెడుతున్నామని.. ఇప్పుడున్న మెడికల్‌కాలేజీలను అభివృద్దిచేస్తున్నామని సీఎం తెలిపారు.

కాలేజీలకు అనుమతులు ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్నికోరామని.. మెడికల్‌కాలేజీలతోపాటు నర్సింగ్‌కాలేజీలకు అనుమతులు ఇచ్చి, తగిన ఆర్థిక సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా బియ్యం సబ్సిడీకింద రాష్ట్రప్రభుత్వానికి చెందిన సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 3,229 కోట్ల బకాయిలను వెంటనే విడుదలచేయాలని ఈమేరకు సంబంధిత శాఖపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారట.

ఇంకా.. గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.4,652.70 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉందని,  వెంటనే ఈడబ్బును చెల్లించేలా చూడాలని జగన్ కోరారు. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రావాల్సిన రూ. 529.95 కోట్ల బకాయిలు ఉన్నాయని, అలాగే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన మరో రూ.497 కోట్లు కూడా పెండింగులో ఉన్నాయని, వీటిని వెంటనే విడుదలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు.  

దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపేలా చూడాలని అమిత్‌షాను సీఎం జగన్ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ బిల్లు –2020కి ఆమోదం తెలిపేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూముల రీ సర్వే ప్రారంభించామని, అన్ని రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నామని తెలిపిన సీఎం. వెంటనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో 250 ఎకరాల భూమిని గిరిజన విశ్వవిద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని వెంటనే యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని జగన్ విజ్ఞప్తి చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: