ఇలాంటి సమయంలో ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే.. ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్ను కానీ తట్టుకునే శక్తి చాలా మంది ఇండియన్లకు ఉందట. ఈ ఒమిక్రాన్ గురించి ఎవరూ భయాందోళనలు చెందనక్కర్లేదట. ఈ విషయాన్ని సుప్రసిద్ధ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ చెబుతున్నారు. ఒమిక్రాన్ గురించి అంతగా భయపడాల్సిందేమీ లేదని ఆయన భరోసా ఇస్తున్నారు. కానీ.. కరోనా విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దని.. ఇంకా మాస్కులు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా చేయాలని ఆయన సూచిస్తున్నారు.
ఇంతకీ.. ఈ షాహిద్ జమీల్ ఎవరు అంటారా.. ఆయన ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్స్ కన్సార్టియా సలహా సంఘానికి గతంలో ఆయన అధ్యక్షుడు. ఇండియాలో కొవిడ్ రెండో దశలో డెల్టా వేరియంట్ చాలా ఎక్కువ మందికి వచ్చిందన్న జమీల్.. 67 శాతం మంది భారతీయుల్లో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయాన్ని జాతీయ సీరో సర్వే కూడా ధ్రువీకరించిందని.. దీన్నిబట్టి చూస్తే.. 94 కోట్ల మందికి పైగా ఇండియన్లలో యాంటీబాడీలు ఉన్నట్టు తెలుస్తోందని జమీల్ తెలిపారు.
డెల్టా వేరియంట్ విజృంభించే నాటికి దేశంలో వ్యాక్సిన్లు వేసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని.. అందువల్లే కొవిడ్ సోకి ఎక్కువ మందిలో యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయని జమీల్ వివరించారు. అందువల్ల చాలా మంది ఇండియన్లు ఒమిక్రాన్ను తేలికగా జయిస్తారని చెబుతున్నారు.