ఘజియాబాద్లోని రెండు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ముగ్గురు విద్యార్థులకు మరియు టీచర్లకు కరోనా సోకడంతో స్కూల్స్ ను తాత్కాలికంగా మూసివేశారు. ఉపాధ్యాయులతో సహా మొత్తం 16 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోయిడా ఆరోగ్య అధికారులు మీడియాకు తెలిపారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేయడానికి గాను.. ఘజియాబాద్లోని ఇందిరాపురంలోనున్న ఓ పాఠశాలను 3 రోజులపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ఈ క్రమంలో కరోనా ఇన్ఫెక్షన్ ను అడ్డుకోవడానికి నోయిడా స్కూల్స్ కు ఏకంగా వారం రోజుల పాటు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
కరోనా సోకిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు నోయిడాకు చెందగా, మిగిలిన ఇద్దరు ఒకే పాఠశాలకు చెందిన వారు. అయితే పిల్లకు కరోనా సోకడంతో స్కూల్స్ మూసేసిన నేపథ్యం లో అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. కరోనా ఈ ప్రపంచాన్ని వీడి ఇప్పుడప్పుడే పూర్తిగా వెళ్లేలా లేదు. అలాగని ఇలా ఎంతకాలం పాఠశాలకు తాళాలు వేస్తారు ? ఇదే శాశ్వత పరిష్కారమా ? అయితే ఇక విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకమేనా అంటూ ఆందోళనలు వినపడుతున్నాయి. కాగా ఇందుకు నిపుణులు ఏమంటున్నారు అంటే...??
న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్కు చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ వినీ కాంత్రూ ఈ అంశం పై మాట్లాడుతూ.... పాఠశాలలను క్లోజ్ చేయడం శాశ్వత పరిష్కారం కాదు. కరోనా నియమాలను తప్పక పాటించడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. విద్యార్ధుల మధ్య భౌతిక దూరం , పిల్లలు సామాజిక పరిశుభ్రత పాటించేలా చూసుకోవడం, మాస్క్ ధరించడంలో టీచర్లు, తల్లిదండ్రులు సమ ప్రాధాన్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వైరస్ ఇప్పటికీ పూర్తిగా అంతం కాలేదన్న నిజం అందరికీ తెలిసిందే. కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు జాగ్రత్తలు తప్పనిసరి. కనీసం ఇంకో రెండేళ్ల పాటైనా ఈ జాగ్రత్తలను పాటించేలా చూసుకుంటూ యదావిధిగా జీవన ప్రయాణం సాగించాలి అని అభిప్రాయపడ్డారు.