రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతినివ్వకపోవడాన్ని పార్టీలకతీతంగా కొన్ని సంఘాలు తప్పుపడుతున్నాయి. రాహుల్ సభకు అనుమతి నిరాకరించడం సరికాదని అన్నారు ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మానవతా రాయ్. చెనగాని దయాకర్, లోకేష్ యాదవ్.. సహా మరికొందరు విద్యార్థి నాయకులు బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించారు.
ఓయూలో రాహుల్ గాంధీ సమావేశానికి అనుమతివ్వకపోవడం నియంతృత్వమని అన్నారు కాంగ్రెస్ నేతలు. మనం నియంత రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టుపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటనను చూసి టీఆర్ఎస్ భయపడుతోందని అందుకే ఓయూని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తోందని విమర్శించారు. యూనివర్శిటీ అధికారులు టీఆర్ఎస్ కు గులాముల్లా పనిచేస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గతంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఎదుట రాజకీయ సభలు జరిగినా పట్టించుకోలేదని, ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ ఓయూకి వస్తారని చెబుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు.