2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె సత్యనారాయణ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన చిన్నం బాబూ రమేష్పై 10,803 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వంతల రాజేశ్వరి విజయాన్ని దక్కించుకున్నారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్ వెంకటేశ్వరరావుపై 6673 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నాగులపల్లి ధనలక్ష్మి గెలుపొందారు. ఇదే ఎన్నికలో టీడీపీ నుంచి పోటీ చేసిన వంతల రాజేశ్వరిపై 39,106 ఓట్ల తేడాతో గెలుపొందారు.
ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉండనుంది. ఇరు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. వైసీపీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికే టికెట్ ఇచ్చింది. దీంతో ఆమెప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాదు.. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనికితోడు తండాల్లోనూ ఆమెకు మద్దతు భారీగా పెరింది. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. మాత్రం తేడా కనిపిస్తోంది. టీడీపీ నుంచి ఇద్దరు ముగ్గురు టికెట్లు ఆశించారు. వాస్తవానికి దీనిని పొత్తులో భాగంగా ముందు జనసేనకు ఇచ్చేయాలని భావించారు.
కానీ, జనసేనకు ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టులేదని తెలిసి.. ఆ సీటును మరియాల శిరీషకు ఇచ్చారు. అయితే.. ఇక్కడి టికెట్ను ఆశించిన మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఇప్పుడు అడ్డం తిరిగారు. టికెట్ తనకే ఇవ్వాలంటూ.. రోజూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాదు.. పార్టీ మారి త్యాగం చేసి వచ్చిన తమకు అన్యాయం చేస్తున్నారని రాజేశ్వరి భర్త కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెండుగా చీలిపోయారు. పలితంగా శిరీష కు ఎవరూ కలిసివస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. దీనిని సర్దుబాటు చేయాలని ఆమె చెబుతున్నా.. పార్టీలో నూ అంతంత మాత్రమే స్పందన వస్తోందని తెలిసింది. ఇది టీడీపీకి భారీ మైనస్గా మారిపోయిందని అంటున్నారు.