- ఇప్పుడు 110 + సీట్లతో జగన్ సీఎం అవుతాడని కోట్లలో బెట్టింగులు
- మారుతోన్న గోదారోడి మూడ్ ఏపీలో అధికారం మార్చేస్తుందా..!
( ఉభయగోదావరి జిల్లాల ప్రత్యేక ప్రతినిధి - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి గోదారి జనాల మూడ్ ఎటు వైపు ఉంటే ఆ పార్టీదే రాష్ట్రంలో అధికారం అన్న నానుడి ఉంది. రాష్ట్ర విభజన జరిగాక రెండు ఎన్నికల్లోనూ గోదావరి ఓటరు ఎవరికి పట్టం కడితే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మరి ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఏపీలో జరుగుతోన్న ఎన్నికల్లో ఏం జ రుగుతోంది. నెల రోజుల్లోనే గోదారోడి మూడ్ ఎందుకు ? మారుతోంది ? బెట్టింగ్ రాయుళ్లు ప్లేట్ ఎందుకు ? ఫిరాయించేస్తున్నారన్న దానిపై గోదావరి జిల్లాల నుంచి ఇండియా హెరాల్డ్ అందిస్తోన్న ప్రత్యేక కథనం.
మామూలుగానే గోదావరి జనాలకు బెట్టింగ్ అంటే చాలా ఇష్టం. అది ఐపీఎల్ అయినా సంక్రాంతి టైంలో కోడిపందాలు.. ఎన్నికల బెట్టింగులు. రాజుల అడ్డాగా పేరున్న భీమవరంతో పాటు రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, అమలాపురం ప్రాంతాల్లో ఏపీ ఎన్నికలపై ఆరేడు నెలల నుంచే బెట్టింగులు మొదలైపోయాయి. అప్పుడు టీడీపీ + జనసేన కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని రూపాయికి రూపాయిన్నర ఇచ్చి మరీ కోట్లలో పందాలు కాశారు. ఇప్పుడు కూటమిలోకి బీజేపీ వచ్చి చేరడంతో పాటు గ్రౌండ్ లెవల్లో ఒక్కసారిగా వాతావరణం మారుతోందన్న అంచనాల నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు కూడా ప్లేటు ఫిరాయించేశారు.
నెల రోజుల క్రిందట టీడీపీ అధికారంలోకి వస్తుందని పందాలు కాసిన వారంతా ఇప్పుడు వైసీపీ గెలుస్తుందని రివర్స్ పందాలు కాస్తున్నారు . రెండు నెలల క్రితం వైసీపీకి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో రెండు చోట్ల కలిపి 4 సీట్లు రావని.. స్టేట్వైడ్గా ఆ పార్టీకి 60 సీట్లు రావని పందాలు కాసిన వాళ్లే ఇప్పుడు జగన్ 110 + సీట్లతో అధికారంలోకి వస్తున్నాడని పందాలు కాస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. రెండు నెలల క్రితం వరకు టీడీపీ కూటమి వైపు కనిపించిన సానుకూల పరిస్థితి ఇప్పుడు లేదని బెట్టింగులు కాసేవాళ్లు తమ వైఖరిని మార్చుకున్నట్టు కనపడుతోంది. నిజంగానే కూటమికి ఇది షాకింగ్ న్యూస్ .
ఇంకా ఎన్నికలకు ఆరు వారాల టైం ఉంది.. ఈ లోగా ఇంకెలా పరిణామాలు మారతాయన్నది చెప్పలేం కాని.. ఇప్పుడు అయితే పందాల మొగ్గు వైసీపీ వైపు స్పష్టంగా కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఎలా నడుస్తోందంటే వైసీపీ అధికారంలోకి వస్తుందని కోట్లలో పందాలు కాసే వారి సంఖ్య భారీగా పెరుగుతుంటే... ఇటు అధికారంలోకి రాదని కాసే వారి సంఖ్య బాగా తగ్గుతోంది. అసలు చంద్రబాబు సింగిల్గా ఎన్నికలకు వెళ్లి ఉంటే జగన్ వ్యతిరేక ఓటు పడి సింపుల్గా గెలిచేవాడని.. జనసేనతో పొత్తు వరకు అంగీకరించవచ్చని.. ఎప్పుడు అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడో అప్పటి నుంచి కూటమి గ్రాఫ్ బాగా పడిపోతోందనే ఎక్కువ మంది చెపుతున్నారు.
ఏదేమైనా ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలో డిసైడ్ చేసే గోదావరోడి మూడ్ మారుతోంది. అక్కడ పొలిటికల్ ట్రెండ్ మారుతోంది. మరి దీనిని ఎలా చూడాలి.. ఇంకా ఎన్నికలకు టైం ఉండడంతో ఈ ట్రెండ్ ఎటు ? ఎలా మలుపులు తిరుగుతుందో ? కాలమే ఆన్సర్ చేయాలి.