గుంటూరు వెస్ట్ నుంచి బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పిడుగురాళ్ల మాధవి అరంగేట్రం చేస్తు న్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆమె... అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత.. ఇక్కడి ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకున్నారు. టీడీపీకి కంచుకోట అయిన వెస్ట్ సీటు కోసం ఎంతోమంది పోటీ పడినా చంద్రబాబు బీసీ మహిళ అయిన మాధవికి సీటు ఇచ్చారు. ఏ నియోజకవర్గంలో అయినా టికెట్ ఆశించిన వారు చాలా మందే ఉంటారు.
టీడీపీలో టికెట్ దక్కక పలు చోట్ల అనేక మంది నాయకులు నిరాశకు కూడా గురయ్యారు. కానీ, ఇక్కడ అలాంటి సంకేతాలు కూడా కనిపించలేదు. టికెట్ ఆశించిన వారు కూడా మాధవిని ప్రకటించగానే స్వాగతించారు. దీనికి కారణం.. సేవా గుణం.. ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే సంకల్పం ఉండడమే. ఇదే మాధవికి ప్రధానంగా కలిసి వస్తున్న అంశం. ఆమెకు సీటు ఇస్తే ఒక్కరు కూడా అపోజ్ చేయకుండా వెంటనే సమన్వయంతో ముందుకు కదిలి వచ్చారంటేనే ఆమె నాయకత్వాన్ని నియోజకవర్గ నాయకులు, కేడర్ ఎలా ముక్తకంఠంతో అంగీకరించిదో తెలుస్తోంది.
ఇక, నియోజకవర్గం పరంగా చూసుకుంటే.. గుంటూరు వెస్ట్ అనేది టీడీపీకి కంచుకోట. ఇక్కడ ఐదు సార్లు ఎన్నికలు జరిగితే.. మూడు సార్లు ఆ పార్టీ జయకేతనం ఎగురు వేసింది. 2019లో వైసీపీ హవా రాష్ట్ర వ్యాప్తంగా వీచినా.. గుంటూరు వెస్ట్లో మాత్రం టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. దీనిని బట్టి ఇక్కడి ప్రజల నాడిని ఇట్టే చెప్పేయొచ్చు. ఇలాంటి నియోజకవర్గంలో బీసీ మహిళకు తొలిసారి చంద్రబాబు అవకాశం ఇవ్వడం మరింత కలిసి వస్తున్న పరిణామం.
దీంతో ఎన్నికలకు ముందే.. మాధవి గెలుపును నాయకులు అంచనా వేయడం కాదు.. రాసిపెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తోన్న మంత్రి విడదల రజనీపై మాధవి గెలుపు కాదు.. మెజారిటీపైనే టీడీపీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నా రు. 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ 4 వేల పైచిలుకు ఓట్లతో నే విజయం దక్కించుకుంది. కానీ, ఇప్పుడు 25 వేలకు పైనే ఉంటుందని గుంటూరు నాయకులు నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. కూటమి వేవ్ మరీ స్ట్రాంగ్గా ఊపేస్తే ఇది ఏకంగా 30 వేలు దాటినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇదీ.. వెస్ట్ సంగతి..!