- భేషజాలు... బేధాలు లేని రాజకీయమే ముగ్గురి లక్ష్యం
- 2024 ఎన్నికల్లోనూ ముగ్గురి గెలుపుపై నో డౌట్
( ప్రకాశం - ఇండియా హెరాల్డ్ )
ఒకే పార్టీలో ఉన్నా.. వేరువేరు పార్టీలలో ఉన్నా.. కొందరు నేతల స్నేహాలు బ్యూటిఫుల్ గా ఉంటాయి. అలాంటి వారిలో బాపట్ల జిల్లాకు చెందిన టీడీపీ సీటింగ్ ఎమ్మెల్యేలు.. ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ స్నేహం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఏలూరి, గొట్టిపాటి విషయానికి వస్తే వీరిద్దరూ రాజకీయంగా వేరువేరు దారిలో ప్రయాణించి ఇప్పుడు ఒకటి అయ్యారు. రవి కాంగ్రెస్ తో ప్రయాణం ప్రారంభించి.. తర్వాత వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏలూరి సాంబశివరావు మాత్రం రెండుసార్లు వరుసగా టీడీపీ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఏలూరి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినప్పుడు కూడా వీరిద్దరి మధ్య అంత స్నేహం లేదు. అదే ఎన్నికల్లో రవి అద్దంకి నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆ తర్వాత రవి టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి ఏలూరి, రవి మధ్య స్నేహం బలపడటం ప్రారంభించింది. అప్పటినుంచి అది క్రమక్రమంగా పెరుగుతూ వీరిద్దరూ ది బెస్ట్ ఫ్రెండ్స్ అనేంతగా పెనవేసుకుపోయింది. ఏలూరి బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షులుగా ఉండడంతో ఆయనకు రవి కేవలం అద్దంకి నియోజకవర్గంలో మాత్రమే కాకుండా.. ఇతర విషయాల్లోను పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే ఏలూరి కూడా రవితో కలిసి మెలిసి వెళుతూ సమన్వయంతో పని చేసుకుంటూ.. సీనియర్ నేతగా రవి సలహాలు స్వీకరిస్తూ.. బాపట్ల పార్లమెంటు పరిధిలో టీడీపీ ఏడు సీట్లు.. ఇటు పార్లమెంటు సీట్లు గెలుచుకునేలా ముందుకు వెళుతూ ఉంటారు.
ఇటు పరుచూరులో ఏవైనా కార్యక్రమాలు జరిగితే.. రవి రావటం అటు అద్దంకిలో కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఏలూరి హాజరవటం.. అలాగే వీరిద్దరూ కలిసి కేవలం బాపట్ల పార్లమెంటుతో పాటు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చంద్రబాబు చెప్పే టీడీపీ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయడం లాంటి పనులు కూడా ఎంతో చక్కగా, చాకచక్యంతో చేస్తూ ఉంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎంతోమంది టీడీపీ నేతలు ఉన్నారు. వారిలో కొందరికి ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టదు. ఇలాంటి నేతల్లో కొందరు పార్టీలు కూడా మారిపోయారు. అయితే వేర్వేరు పార్టీలలో నుంచి వచ్చినా గత ఐదారేళ్ళలో ఎమ్మెల్యేలు ఏలూరి, రవి స్నేహం మాత్రం ది బెస్ట్ అనేంతగా కొనసాగుతుంది. అందుకే టీడీపీలో రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు.. పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ కూడా వీరిద్దరి స్నేహాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మెచ్చుకుంటూ ఉంటారు.
ఏలూరి - అనగాని సొంత సోదరుల లెక్కే...
ఎమ్మెల్యే ఏలూరి, మరో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ది కూడా సొంత సోదరుల బంధం లెక్క. వీరిద్దరు కూడా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు టీడీపీ నుంచి గెలుస్తూ వస్తున్నారు. 2014 నుంచి మొదలైన ఈ స్నేహం సొంత సోదరులు అనేలా కొనసాగుతోంది. ఇద్దరూ రాజకీయంగాను, ఇతర విషయాల్లోనూ ఒకరి సలహాలు మరొకరు తీసుకుంటూ ముందుకు వెళుతుంటారు. 2019లో ఇద్దరూ రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచాక.. ఇప్పుడు ఏలూరి బాపట్ల పార్లమెంటు పార్టీ అధ్యక్షులుగా ఉండడంతో ఇద్దరి మధ్య మరింత సమన్వయం పెరిగింది. ఇలా ఏలూరికి అటు రవితోనూ, ఇటు అనగానితో ఉన్న స్నేహ బంధం సోదర బంధం లాంటిదే అని చెప్పాలి.