బీజేపీ, కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ పార్టీదే ఈ నియోజకవర్గంలో పై చేయిగా ఉంది.
అయితే ఇక్కడ బీసీ కార్డును ఉపయోగించాయి బీ ఆర్ ఎస్, బీజేపీలు. కాంగ్రెస్ మాత్రం రెడ్డి సామాజిక వర్గంకు చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది. బీజేపీ ఈ స్థానంలో పాగా వేయాలని అనేక పథకాలు రచిస్తుంది. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో పాటు బీసీ వర్గానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్కి టికెట్ కేటాయించింది. డాక్టర్ బూర నర్సయ్య గతంలో బీ ఆర్ ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన నర్సయ్యకు డాక్టర్ గా పేరుంది.
బీజేపీ దీని ద్వారా ఈ స్థానంలో బలమైన పోటీకి తెర లేపింది. ఈ స్థానంలో బీఆర్ఎస్ సైతం యాదవ సామాజిక వర్గంకు చెందిన బీసీ నేత క్యామ మల్లేశ్కు టికెట్ను కేటాయించింది. బీసీ ఓటర్లని గంపగుత్తగా తమవైపు తిప్పుకోవాలనే బీజేపీ వ్యూహం రచిస్తే, బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా బీసీ నేతకు టికెట్ను కెటాయించి బీజేపీ ఆశలపై నీళ్ళు చల్లిందని చెప్పవచ్చు. బీసీల ఓట్లు ఇద్దరు అభ్యర్థులు చీల్చనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ కూడా విస్తృత ప్రజాసంబంధాలున్న పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చింది.
కాంగ్రెస్కు ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం కలిసొచ్చే అంశం. అలాగే ఈ ఎమ్మెల్యేలందరూ గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీలు సాధించారు. బీ ఆర్ ఎస్ కు ఒక ఎమ్మెల్యే ఉండటంతో ఈ స్థానంలో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ నడుమనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు. మరి బీజేపీ ఏ మేరకు ఇక్కడ రాణిస్తుందో వేచి చూడాల్సిందే.