నామినేషన్ల పర్వం మొదలైనా కూటమిలో కుంపట్లు మాత్రం ఇంకా చల్లారడం లేదు. శ్రీకాకుళం దగ్గర నుంచి కర్నూలు వరికి అవే లుకలుకలు. గందరోగోళాలు. ఏదో ఒకటి రెండు కాదు. 20కి పైగా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో చంద్రబాబు కూటమి నేతలు స్వపక్షంలోనే విపక్షాన్ని ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీలో ఉన్నారు. నందిగామ మండలం బీజేపీకి చెందిన అట్టాడ రాజేశ్ రెబల్ గా బరిలో నిలిచారు. ఇది ఆజిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.
రాజేశ్ బీజేపీ ఓబీసీ జిల్లా మోర్చా అధ్యక్షుడిగా, బీసీ వెల్ఫేర్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన తాజాగా శుక్రవారం నామినేషన్ వేశారు. టికెట్ దక్కకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. నూజీవీడు బరిలో ఉండనున్నారు. ఆ మధ్య వైసీపీలో చేరతారనే ప్రచారం సాగినా.. తెలుగుదేశం సానుభూతి పరుడిగానే పోటీకి రెడీ అవుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉండి నియోజకవర్గం మరో లెక్క.
ఇక్కడ రాజు వర్సెస్ రాజు గా జరుగుతున్న ట్రయాంగిల్ ఫైట్ లో.. ముగ్గురి మధ్య పోటీ డైలీ సీరియల్ మాదిరి కొనసాగుతుంది. మరోవైపు రఘురామ నుంచి నామినేషన్ కూడా పడింది. దీంతో ఉండి మరింత వేడెక్కింది. అయితే ముందుగా టికెట్ దక్కించుకున్న, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఏంచేస్తారు అనే చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ ముగ్గురిలో ఎవరికీ బీఫాం ఇస్తారో వేచి చూడాలి. నామినేషన్ పర్వం ముగిసే నాటికి రెబల్స్ బెడద ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మరి ఇవి కుదురుకుంటాయా.. లేక కూటమిని కాటేస్తాయా అనేది చూడాలి.