మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి కన్నడ నాటు బీజేపీని ఎలాగైనా నిలువరించాలనే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కర్ణాటకలో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేయగా.. బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. అయినప్పటికీ బీజేపీ 28 స్థానాలకు 25 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ మద్దతు ఇచ్చిన సుమలత ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు.
ఇక కాంగ్రెస్ 21 చోట్ల పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందింది. జేడీఎస్ ఏడింటిలో బరిలో ఉండి ఒక్కచోట మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇదంతా సులభంగా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఎప్పుడైతే జేడీఎస్ తో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నించిందో అప్పుడే ఆ పార్టీ బలహీన పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గతంతో పోల్చితే ఈ సారి గణనీయ సీట్లు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలు సర్వేలు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీలపై వ్యతిరేకత, బీజేపీ రాష్ట్ర నేతల మధ్య విభేదాలు ఆ పార్టీకి మైనస్ గా మారాయి. మరోవైపు ఈ సారి ఏడు స్థానాలకే పరిమితం అవుతుందని.. పది చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని ఈదినా సంస్థ తన సర్వే ఫలితాలను ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే దక్షిణాన బీజేపీకి షాక్ తగిలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.