- రోజా, పురందేశ్వరి కోసం భర్తల కష్టం
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
రాజకీయాలు మారాయి. ఒకప్పుడు భర్తలు ఎన్నికల రంగంలో ఉంటే.. భార్యలు ఉడతా భక్తిగా ప్రచార కార్యక్రమాలు చూసుకునేవారు. అది కూడా నామమాత్రంగానే. వైఎస్ రాజశేఖరరెడ్డి 30 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఏనాడూ ఆయన సతీమణి విజయమ్మ బయటకు రాలేదు. కనీసం జెండా కూడా పట్టుకోలేదు. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే. ఇక, అన్నగారు ఎన్టీఆర్ సతీమణి బసవ తారకం కూడా.. ఏనాడూ బయటకు వచ్చి.. పార్టీ కోసం పనిచేయలేదు.
కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భార్యలు బయటకు వస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. భార్యల కోసం భర్తలు రంగంలోకి దిగుతుండడం. ఇది రివర్స్ అన్నమాట. తమ భార్యల గెలుపు కోసం.. ఎండలను కూడా లెక్క చేయకుండా.. భర్తలు.. ప్రజల్లో తిరుగుతున్నారు. ఉన్నపనులు కూడా పక్కన పెట్టి మరీ.. పోటీలో ఉన్న భార్యా మణి విజయం కోసం తపిస్తున్నారు. ఈ ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదీ..
పురందేశ్వరి:
బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్నారు. అయితే.. ఈమె కన్నా.. ఈమె భర్త, సీనియర్ నాయకుడు..దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలో ప్రచారం చేస్తున్నారు. రాజమండ్రిలోనే రెండు వారాలుగా తిష్ఠ వేసిన ఆయన భార్య గెలుపు కోసం.. మేథావులను కలుస్తున్నారు. విద్యావంతులతో భేటీ అవుతున్నారు. సైలెంట్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
వేమిరెడ్డి ప్రశాంతి:
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్పై బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి కోసం.. ఆమె భర్త, నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తన గెలుపు కన్నా.. తన భార్య కోసం ఆయన చెమటోడుస్తున్నారు. వారానికి మూడు రోజులు కోవూరులోనే ఆయన ప్రచారం చేస్తున్నారు.
ఆర్కే రోజా:
వైసీపీ ఫైర్బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ తరఫున ఉన్న గాలి కుటుంబంపై ఈమె పోరాడుతున్నారు. గతంలో రెండు సార్లు విజయందక్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఫైట్ టఫ్ అని తేలడంతో భర్త సెల్వమణి రంగంలోకి దిగారు. మీడియా మీటింగులు.. మేధావి వర్గాలను అక్కున చేర్చుకుంటున్నారు. ఎలాగూ దర్శకుడు కావడంతో షార్ట్ ఫిల్మ్లు తీసి.. సోషల్ మీడియాలో రోజాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు తమిళనాడు బోర్డర్ మండలాల్లో స్వయంగా పర్యటిస్తున్నారు. ఎండ కూడా లెక్కచేయకుండా.. దూసుకుపోతున్నారు.
భువనేశ్వరి:
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి.. నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం శ్రమి స్తున్నారు. ఇదేసమయంలో కుప్పం నియోజకవర్గంలో ఆమె తన భర్త గెలుపు కోసం.. ఇంటింటి ప్రచారాని కీ.. శ్రీకారం చుట్టారు. తన భర్త చంద్రబాబును గెలిపించాలని.. ఇక్కడ అభివృద్ది బాధ్యతను తానే తీసుకుంటానని కూడా ఆమె ప్రకటించారు.
వసుంధర:
నటసింహం నందమూరి బాలయ్య పోటీ చేస్తున్న హిందూపురం నుంచి ఆమె ప్రచారం జోరెత్తిస్తున్నారు. భర్త గెలుపు కోసం.. ఎన్నడూ ఎరుగని పేదల ఇళ్లకు గుడిసెలకు కూడా వెళ్లి.. వారి ఇళ్లలో పరిస్థితిని తెలుసుకుంటున్నారు. వారికి భరోసా ఇస్తున్నారు. మండు టెండలోనూ రోడ్లపై మెరుస్తున్నారు.
బ్రాహ్మణి:
నారా లోకేష్ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆయన భార్య. ఉన్నత విద్యను చదివిన ఆమె ఇప్పుడు.. నేలకు దిగి వచ్చారు. మంగళగిరిలో పొలాల్లోకి వెళ్లి.. కూలీగా మారారు.నేతన్నల ఇంటి గడప తొక్కి.. వారి కష్టాలు తెలుసుకున్నారు. గడపగడపకు వెళ్తూ.. ప్రజలను ఓట్లు అర్ధిస్తున్నారు. భర్త నారా లోకేష్ గెలుపు కోసం.. ఎంతో శ్రమిస్తున్నారు.
గద్దె అనురాధ:
విజయవాడ ఈస్ట్ నుంచి బరిలో ఉన్న టీడీపీ నాయకుడు.. గద్దె రామ్మోహన్ గెలుపు కోసం.. ఆయన సతీమణి అనురాధ.. అలుపెరుగని కృషి చేస్తున్నారు. మాజీ జడ్పీ చైర్ పర్సన్ కూడా కావడంతో ఆమె.. నిరంతరం.. ప్రజల్లోనే ఉంటున్నారు. గద్దెకు ఓటేయాలని పిలుపునిస్తున్నారు. మహిళా సంఘాలతోనూ మమేకం అవుతున్నారు.