బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి విషయంలో ఆ పార్టీ నాయకులు పెదవి విరుస్తున్నారు. ఇదేం పద్ధతి పురం దేశ్వరి గారూ! అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం.. ఆమె తను పోటీ చేస్తున్న నియోజకవర్గం వరకే పరిమితం అయ్యారు. నిజానికి పార్టీ చీఫ్గా ఉన్న పురందేశ్వరి.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి. లేదా.. కనీసం వీక్గా ఉన్న నాయకులనైనా.. గుర్తించి వారిని గెలిపించుకునేందుకు ప్రయత్నించాలి. కానీ, ఎక్కడా ఆ ప్రయత్నం సాగలేదు.
కనీసం ఎవరి గురించి కూడా పురందేశ్వరి పట్టించుకోవడం లేదు. ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తు న్న బీజేపీ అభ్యర్థుల పక్షాన కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా.. ఆమె పర్యటించలేదు. పోనీ.. వెళ్లక పోయినా.. నియోజకవర్గాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ కానీ.. టెలీ కాన్ఫరెన్స్ కానీ చేయడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్తితి కూడా అంచనా వేయడం లేదు. మరి ఇలా అయితే.. పార్టీ ఏమేరకు ముందుకు సాగుతుందనేది ప్రశ్న.
ఇక్కడ. పురందేశ్వరికి పార్టీతో పనిలేదని.. అనేవారు పెరుగుతున్నారు. రాజమండ్రిలో తను గెలిస్తే చాలనే వ్యూహంలో ఉన్నారని.. పలువురు బీజేపీ నాయకులే ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇది దూర దృష్టితో చూస్తే.. పార్టీకి మేలు కాదని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే.. కేవలం నలుగురు మాత్రమే బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. మిగిలిన స్థానాల్లో నాయకులు వీక్గానే ఉన్నారు. వీరి పక్షాన అయినా.. ప్రచారం చేస్తారని అనుకున్నా.. పురందేశ్వరి పాదం కదపడం లేదు.
దీంతో ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ పక్షాన ప్రచారం పెద్దగా సాగడం లేదు. ఒక్క రాజమండ్రి, అనకాపల్లి పార్లమెంటు స్థానాల్లోను.. విజయవాడ వెస్ట్, విశాఖ ఉత్తర నియోజకవర్గాల్లోనూ ప్రచారం కనిపిస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం ఎక్కడా ప్రచార ఊపు కనిపించడం లేదు. దీనికి కారణం.. పురందేశ్వరి అవలంభిస్తున్న ఒంటికన్ను విధానమేనని పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. కూటమి పక్షాన కూడా ఆమె ప్రచారం చేసేందుకు ఉత్సాహం చూపించకపోవడం గమనార్హం.