- షర్మిల కొంగు రాజకీయం సెంటిమెంట్ వైసీపీని ఓడిస్తుందా
- ట్రయాంగిల్ ఫైట్లో డమ్మీగా మారిన టీడీపీ భూపేష్ రెడ్డి
( కడప - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంది. అయితే అవన్నీ అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఏపీలో ఎప్పుడూ లేనట్టుగా ఇంకా చెప్పాలంటే గత కొన్ని ఏళ్లలో.. ఏపీ విభజన జరిగాక ఏ పార్లమెంటు నియోజకవర్గంలో లేనట్టుగా ఈ ఎన్నికల్లో కడప పార్లమెంటులో మాత్రం ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. వైసీపీ నుంచి గత రెండు ఎన్నికల్లోనూ గెలిచిన సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి జమ్మలమడుగు ఇన్చార్జ్ గా ఉన్న భూపేష్ రెడ్డి పోటీలో ఉన్నారు.
ఇక్కడ భూపేష్ జమ్మలమడుగు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉంది. అయితే తన పెదనాన్న ఆదినారాయణ రెడ్డికి పొత్తులో భాగంగా సీటు త్యాగం చేసేందుకు భూపేష్ పార్లమెంటుకు పోటీ చేయక తప్పలేదు. ఇక కాంగ్రెస్ నుంచి సీఎం జగన్ సోదరి వైఎస్. షర్మిలా రెడ్డి పోటీ చేస్తున్నారు. షర్మిల గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసి ఈ సారి ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో హస్తం సింబల్ పై కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు.
షర్మిల ఈ సారి కడప పార్లమెంటు పరిధిలో గట్టిగానే ఓట్లు చీల్చుతుందని అంటున్నారు. ఆమె కొంగుచాపి మరీ ఈ సారి తనకు ఓట్లేసి గెలిపించాలని పండిస్తోన్న సెంటిమెంట్ మంత్రం కొంత వరకు ఫలిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే షర్మిల గెలుస్తుందా ? లేదా వైసీపీని ఓడిస్తుందా ? వైసీపీ మెజార్టీ తగ్గిస్తుందా ? అన్నదే చూడాలి. అయితే వైసీపీ కి కడప పార్లమెంటు గెలుపు 2014 - 2019 అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. ఇక ముక్కోణపు పోటీలో టీడీపీ భూపేష్ రెడ్డి డమ్మీ గా మారాడనే చెప్పాలి.