- సంక్షేమంతో పన్నులు పెంచిన జగన్ సర్కార్
- నిధుల కొరతతో పన్నుల బాదుడు బాదేసిన జగన్
( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
ప్రభుత్వాలు నడవాలంటే డబ్బులు కావాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నిజానికి ప్రభుత్వాలు.. మనీ మేకింగ్ యూనిట్లు కావు. అంటే.. ప్రభుత్వాలు డబ్బులు సృష్టించలేవు. ప్రజలుకట్టే పన్నులపైనే ఆధార పడి మనుగడ సాగిస్తాయి. వీటి నుంచే ఉద్యోగులకు జీతాలు ఇస్తాయి. వీటి నుంచే సంక్షేమానికి ఖర్చు పెడతాయి. ఇతర ఖర్చులు కూడా.. పన్నులు, ఇతర చార్జీల నుంచి వసూలు చేసే సొమ్ముతోనే సాగిస్తా యి. ఇది కేంద్రానికైనా.. రాష్ట్రానికైనా ఒక్కటే థియరీ.
అయితే.. ఏపీలో చంద్రబాబు 2014-19 మధ్య పన్నులు పెద్దగా పెంచింది లేదని అంటారు. కానీ, వాస్తవం ఏంటంటే.. ఇతర చార్జీలను పెంచకపోయినా.. ఆస్తిపన్నులు మాత్రం మూడు రెట్లు పెంచారు. అప్పటి వరకు రూ.100 ఉండే గుడిసెల పన్ను.. రూ.500లకు చేరింది. నీట కుళాయిల పన్నులు కూడా ఇదే తరహాలో పెంచారు. అయితే.. కీలకమైన విద్యుత్ చార్జీల జోలికి మాత్రం చంద్రబాబు వెళ్లకపోవడం గొప్ప విషయంగానే చెప్పాలి. ఇదే సమయంలో కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఆయన చెత్తపన్ను జోలికి పోకుండా.. మేనేజ్ చేసుకున్నారు.
అంతేకాదు.. ఆర్టీసీ బస్సు చార్జీలను కూడా పెంచలేదు. అయితే.. పెట్రోల్పై మాత్రం రోడ్ సెస్సు రూపంలో రూ.1 పన్ను తెచ్చింది మాత్రం టీడీపీ సర్కారే. ఫలితంగా పన్నుల భారం లేని ప్రభుత్వంగా అంతో ఇంతో చంద్రబాబుకు పేరుంది. ఇక, జగన్ విషయానికి వస్తే.. సంక్షేమానికి 80 శాతం పీట వేయడం..ఇచ్చే పథకాలు కూడా.. రూ. వేలల్లో ఉండడంతో ఆయనకు నిధుల కొరత పెరిగిపోయింది. ఇదే సమయంలో ఉద్యోగుల జీతాలు ఒకసారి పెంచడంతోనూ..ఆయన ఇబ్బందులు పడ్డారు.
దీంతో పన్నులు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని వైసీపీ సమర్థించుకుంటుంది. పెట్రోలు, డీజిల్పై పన్నులు పెంచిన మాట వాస్తవం. ఇక, విద్యుత్ విషయంలో ఏకంగా ఆరు సార్లు పెంచారు. అయితే.. ఇవన్నీ..చంద్రబాబు హయాంలో పెంచాల్సినవని.. ఆయన పెంచకుండా ఉన్నందునే తాము పెంచాల్సి వచ్చిందని వైసీపీ సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఇక, చెత్తపన్నును వేయడం ద్వారా.. వైసీపీ మరో దూకుడు చర్య తీసుకుంది. మొత్తంగా చూస్తే.. ప్రజల మాట ఏంటంటే.. చంద్రబాబు కన్నా.. వైసీపీ హయాంలోనే పన్నుల బాదుడు ఎక్కువగా ఉందని!!