- వలంటీర్లు, సచివాలయ వ్యవస్థతో దేశానికే జగన్ పాలన ఆదర్శం
- జగన్ మాస్ ఆలోచన Vs బాబు క్లాస్ ఆలోచన
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి లేదా నాయకుడు.. కేవలం పాలన వరకే పరిమితం కారు. సంచ లన నిర్ణయాలు.. కీలక అడుగులు కూడా వేయాల్సి ఉంటుంది. ఇలా చూసుకుంటే.. అదే ప్రజలలో ఆ ముఖ్యమంత్రి పట్ల విశ్వసనీయత.. దమ్మున్న నాయకుడిగా ముద్ర వేసేలా చేస్తుంది. గతంలో పాలించిన ఎన్టీఆర్ మహిళలకు ఆస్తి హక్కు, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి కీలక స్టెప్స్ వేశారు. ఇది ఆయనను తరతరాల వరకు గుర్తుండిపోయేలా చేసింది. ఇప్పటికీ టీడీపీ ఈ జపమే చేస్తోంది.
ఇక, చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయన ఐటీ రంగంలో చూపించిన శ్రద్ధ.. క్షేత్రస్థాయిలోకి వచ్చే సరికి తేలిపోయింది. కానీ, ఇక్కడ చిత్రంఏంటంటే.. ఓటు బ్యాంకు ఐటీ వల్ల సాధ్యం కాదు. ఉన్నతికి మంచిదే కావొచ్చు.. రాజకీయంగా చూసుకుంటే.. మాత్రం ఇది మైనస్ అనే చెప్పాలి. అయినా.. ఐటీ అనగానే తళు క్కున మెరిసేపేరు చంద్రబాబుదే. ఇక, విభజిత ఏపీలో అమరావతి నిర్మాణం చేపట్టారు. ఇది కూడా బాబుకు మంచి పేరే తెచ్చింది. కానీ, ఆయన పూర్తి చేయలేక పోవడంతో ఆ క్రెడిట్ను సొంతం చేసుకోలేక పోయారనేది ప్రధాన విమర్శ.
ఇవి మినహా.. అన్న క్యాంటీన్లు ప్రవేశ పెట్టినా.. అవి.. ఎన్నికలకు నాలుగు మాసాల ముందు తీసుకురావ డంతో ఆశించిన ప్రయోజనం ఇవ్వలేక పోయింది. బలమైన ముద్రను కూడా వేయలేక పోయింది. ఒకరకంగా చెప్పాలంటే.. చంద్రబాబు సంచలన నిర్ణయంగా దీనిని చూసే పరిస్థితి లేకుండాపోయింది. ఇక, 2019లో అధికారం చేపట్టిన.. వైసీపీ అధినేత జగన్.. సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి అన్నట్టుగా ముందుకు సాగారు. ప్రభుత్వ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసేందుకు.. వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు.
అసలు ఇది సాధ్యమేనా? 50 ఇళ్లకు ఒక వలంటీరా? ఇన్ని లక్షల మందా(2.3 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు)? వారికి జీతాలు ఎలా ఇస్తారని అందరూ సందేహించారు. కానీ, సాధ్యం చేసి చూపించారు. తర్వాత.. ఈ వ్యవస్థపై అనేక విమర్శలు వచ్చాయి. ఇవి రాజకీయ విమర్శలే. అయినా.. జగన్ తట్టుకుని నిలబడ్డారు. ఫలితంగా నేడు వలంటీర్ వ్యవస్థను రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా.. తప్పకుండా కొనసాగించక తప్పని పరిస్థితిని తీసుకువచ్చారు.
ఇక, సచివాలయాల ఏర్పాటు. సీఎం జగన్ చేసిన మరో సంచలన నిర్ణయం. వార్డు, గ్రామ సచివాలయా లను అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని మరీ వీటిని ఏర్పాటు చేశారు. అప్పటికే ఉన్న పంచాయతీ లు, ఎంపీడీవో కార్యాయాలను చూపిస్తూ.. ఇవి వేస్ట్ అని ప్రతిపక్షాలు దుయ్యబట్టినా.. సాహసోపేతంగా ముందుకు సాగారు. ఫలితంగా 1.3 లక్షల మంది కొత్త ఉద్యోగులు వచ్చారు. ఇప్పుడు ఈ వ్యవస్థ ప్రజలతో మమేకం అయిపోయింది. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా. తీసేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. సో.. ఎలా చూసుకున్నా.. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో క్షేత్రస్థాయిలో ఆలోచించిన వారు జగన్ అయితే.. క్లాస్గా ఆలోచించిన వారు చంద్రబాబు.