గులాబీ పార్టీలోని కీలక నేతలందరూ కూడా ఇప్పటికే కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. కడియం శ్రీహరి కేకేలాంటి కీలక నేతలు వలస పోవడంతో మిగతా నేతల్లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. అంతేకాదు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీలు సైతం కారు దిగేశారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో ఇలా బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇక ఇదే విషయాన్ని ప్రతి ప్రెస్ మీట్ లో కూడా చెబుతూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఎంతో మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అంటూ ఇప్పటికే పలువురు కాంగ్రెస్ కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయ్.
ఇక ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ లో మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బిఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత జూన్ 5వ తేదీన తెలంగాణ భవన్ కు తాళం వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటూ జోష్యం చెప్పాడు. 25 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బిఆర్ఎస్ ఎంపీ నామినేషన్లు వేసిన ఆరుగురు అభ్యర్థులు కూడా తమను సంప్రదించారని.. కెసిఆర్ పార్టీ శకం ముగిసినట్లు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు వెంకట్ రెడ్డి.