వైసీపీ విషయానికి వస్తే.. చాలా మంది మేధావి వర్గం.. ఆ పార్టీకి అండగా నిలిచిందనే చెప్పాలి. ఎన్నారైల నుంచి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా.. సోషల్ మీడియా వేదికగా.. వైసీపీకి అండదండలు అందించారు. వీరు నిత్యం రీల్స్ రూపంలోనో..విశ్లేషణల రూపంలోనో.. జగన్ పాలనను ప్రజల్లోకి పాజిటివ్ గా తీసుకువెళ్లారు. కొందరు లిరిక్ రైటర్లు పాటలు రాసి పుణ్యంకట్టుకున్నారు. కొన్ని కొన్ని గీతాలైతే.. ఇప్పటికీ జనాల నాలుకలపై తిరుగాడుతున్నాయి.
ఇక, మాజీ ఎంపీలు కొందరు.. ఉదాహరణకు గోకరాజు గంగరాజు వంటివారు.. పరోక్షంగా చక్రం తిప్పారు. ఢిల్లీలో కూర్చుని ఆయా జిల్లాల నాయకులను ముందుండి నడిపించడం..కులాలను సమీకరించి.. ఓటు బ్యాంకు పడేలా చేయడంలోనూ వైసీపీకి సహకరించారు. వీరిలో గాదె వెంకట రెడ్డి కుమారుడు బాపట్లలో కీలక రోల్ పోషించాడు. అదేవిధంగా సినీ రచయిత కోన వెంకట్ కూడా.. పార్టీకి సేవలందించారు. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. వైసీపీ బాటలోనే చాలా మంది నడిచారు.
అయితే.. వైసీపీతో పోల్చుకుంటే.. సోషల్ మీడియాలో టీడీపీ హవా తగ్గిందనే ఒక అంచనా ఉంది. నేరుగా మీడియాలోనే సపోర్టు చేశారు. ఇక, తాము పోటీ చేయని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు పార్టీ సీపీఐ.. పరో క్షంగా చంద్రబాబుకు సహకరించిందనే వాదన తెరమీదికి వచ్చింది. వాస్తవానికి సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కూటమికి అనుకూలంగా పనిచేశాయి. ఇక, ఎన్నారైలు నేరుగా ఏపీకి వచ్చి టీడీపీకి అనుకూలంగా ఓటేశారనే వాదన కూడా ఉంది. మొత్తంగా ఇరు పక్షాల్లోనూ .. తెరచాటున ఉండి చక్రం తిప్పిన వారు చాలా మందే ఉండడం గమనార్హం. మరి వీరి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.