- కడప ఉక్కు ఫ్యాక్టరీ గాలికొదిలేసిన ప్రభుత్వాలు
- ఏపీ ఉక్కు అంటే ఓ తుక్కేనా..?
( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
రాష్ట్రంలో అత్యంత కీలకమైన రంగాల్లో ఉక్కు పరిశ్రమ ఒకటి. ప్రభుత్వ రంగంలో తొలిసారి ఏర్పాటైన ఉక్కు పరిశ్రమ కూడా.. ఏపీలోనే ఉంది. అది విశాఖ ఉక్కు కర్మాగారం. ఆ తర్వాత.. ఇతర రాష్ట్రాల్లో ఏర్పా టు చేశారు. అయితే..రాష్ట్ర విభజన తర్వాత.. రాష్ట్రానికి ఆదాయం.. ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మరో ఉక్కుకర్మాగారం ఏర్పాటు చేసేందుకు.. కేంద్రం విభజన చట్టంలో అవకాశం కల్పించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని దీనిలో చేర్చింది.
అంటే.. కడపలో ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం తన నిధులతో నిర్మించాల్సి ఉంది. అదేవిధంగా విశాఖ ఉ క్కు కర్మాగారాన్ని మరింత అభివృద్ది చేయాలని కూడా పేర్కొంది. అయితే.. 2019తర్వాత.. నుంచి పరిస్థితి మారిపోయింది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే పనులు ప్రారంభమయ్యాయి. దీనిని కేంద్రం తప్పనిసరిగా ప్రైవేటు పరం చేస్తామని.. దీనివల్ల నష్టాలు వస్తున్నాయని.. బొగ్గును ఇవ్వలేమని కూడా తేల్చి చెప్పింది. మరోవైపు.. దీనిపై అనేక ఉద్యమాలు సాగాయి.
ఇక, కడప ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం నిర్మించాల్సి ఉంది. కానీ.. 2015 నుంచి కూడా.. దీనిని నిర్లక్ష్యంచేస్తూ వచ్చారు. ఒకానొక దశలో.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నిరాహార దీక్ష కూడా చేయడం గమనార్హం. దీనికి కేసీఆర్ తనయ కవిత కూడా మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ.. కేంద్రంలోని మోడీ సర్కారు దీనిపై దృష్టి పెట్టలేదు. దీంతో అప్పటిసీఎం చంద్రబాబు తానే నిర్మిస్తానంటూ.. భూమి పూజ చేశారు. ఇంతలో ప్రభుత్వం మారింది. అడుగు కూడా ముందు కు పడలేదు.
తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా.. కడప ఉక్కు విషయంలో ఎలాంఇ చర్యలూ చేపట్టలేదు. పైగా. కేంద్రంలోపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్మించాల్సిన అవసరం ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కడప ఉక్కు ఫ్యాక్టరీ మరోసారి సందేహంలో పడింది. ఎన్నికలకు ఆరు మాసాల ముందు మరోసారి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ.. ఇది ముందుకు కదలలేదు. ఒకవైపు ఉన్న దేమో ప్రైవేటు పరం అవుతుండడం.. కొత్తది ముందుకు కదలకపోవడంతో ఏపీకి ఉక్కు అనే మాట తుక్కుగానే కనిపిస్తుండడం.. వినిపిస్తుండడం గమనార్హం.