గత ఐదేళ్లలో జగన్ సర్కార్ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కిడ్నీ బాధితుల సమస్యలను పరిష్కరించేలా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో పాటు పింఛన్ మొత్తాన్ని భారీగా పెంచింది. కిడ్నీవ్యాధుల వెతలు తీర్చడానికి బృహత్తర ప్రయత్నం మొదలైనా కిడ్నీ వ్యాధులతో బాధ పడేవాళ్ల కష్టాలు మాత్రం పూర్తిస్థాయిలో తీరలేదు.
కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఉద్ధానంలో నివశించే వాళ్లలో 37 శాతం కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉండగా అందులో 10 సంవత్సరాలకు పైగా వ్యాధులతో బాధ పడేవాళ్లు 21 శాతం ఉండటం గమనార్హం. ఉద్ధానానికి జగన్ సర్కార్ ఊపిరి పోసినా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంది.
గడిచిన 4 దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంత ప్రజలు ఈ సమస్య వల్ల నరకం అనుభవిస్తున్నారు. కిడ్నీ వ్యాధి ఊళ్లకు ఊళ్లు తినేస్తుందని ఇక్కడి బాధితులు చెబుతారు. ఇక్కడ కిడ్నీ వ్యాధులకు ఇప్పటివరకు సరైన కారణాలను కూడా కనిపెట్టలేకపోయారని తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ ఉద్ధానంపై వేర్వేరు సందర్భాల్లో మాటల్లో ప్రేమ కురిపించినా చేతల్లో మాత్రం ఏం చేయలేకపోయారు. మరికొన్ని రోజుల్లో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అయినా ఉద్ధానం బాధితులకు అండగా నిలిచి వ్యాధికి సరైన కారణాన్ని గుర్తించి సమస్య పరిష్కారం అవుతుందేమో చూడాల్సి ఉంది. ఉద్దానం సమస్య విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో తెలియాల్సి ఉంది.