- పార్టీ పగ్గాల విషయంలో సీనియర్ల ధిక్కారాలు ఉంటాయ్..!
- జూనియర్ ఎన్టీఆర్కు పార్టీ పగ్గాలివ్వాలనే డిమాండ్ ..?
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలూ బలమైన పోటీ ఇచ్చాయి. ఎవరూ ఎక్కడా తగ్గలేదు. మరీ ముఖ్యంగా పార్టీ యువ నాయకుడు, భవిష్యత్తులో పార్టీ పగ్గాలు తీసుకుంటారనే ప్రచారంలో ఉన్న చంద్రబాబు తనయుడు నారాలోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అందరి కళ్లూ.. ఆలోచన కూడా ఈ నియోజకవర్గంపైనే ఉంది. గెలవాలని అందరూ కోరుకున్నారు. చివరి నిముషం వరకు కూడా నారా, నందమూరి కుటుంబాలు కూడా.. ఇక్కడ ప్రచారం చేశాయి.
అయితే.. ఒకవేళ.. వైసీపీ చేసిన ఈక్వేషన్ ఫలించి.. మురుగుడు లావణ్య కనుక గెలుపు గుర్రం ఎక్కితే.. నారా లోకేష్ స్వల్ప తేడాతో అయినా.. ఓడిపోతే.. ఏం జరుగుతుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే కనుక జరిగితే.. నారా లోకేష్ రాజకీయాలపై పెను ప్రభావం పడుతుందని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే.. రాజకీయంగా ఆయన ఇప్పటికే ఒకసారి ఓటమి చవిచూశారు. దీంతో ఐరన్ లెగ్ అనే కామెంట్లు తొలినాళ్లలో వినిపించాయి. నిజానికి నారా, నందమూరి కుటుంబాల్లో ఓటమి ఉన్నా.. తొలి ఓటమి ఎవరికీ ఎదురు కాలేదు.
చంద్రబాబు తొలిసారి చంద్రగిరి నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అలానే అన్నగారు ఎన్టీఆర్ కూడా.. తొలి సారి ఎన్నికల్లోనే విజయం సాధించారు. ఇక, 2014లో తొలిసారి బరిలో నిలిచిన నందమూరి బాలయ్య కూడా.. విజయం దక్కించుకున్నారు. మరి వీరి కుటుంబం నుంచి వచ్చిన నారా లోకేష్ తొలిసారి ప్రయత్నంలోనే విఫలమయ్యారు. ఇప్పుడు పట్టుబట్టి మరోసారి మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఓడితే.. ఆయనపై మరిన్ని విమర్శలు.. రాజకీయ దాడులు ఖాయమని పరిశీలకులుచెబుతున్నారు.
ఇదే సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలోనూ చంద్రబాబు మాట ఎలా ఉన్నా..సీనియర్ల నుంచి వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. ఇంతకన్నా చిత్రమైన, ఘోరమైన విషయం ఏంటంటే.. జూనియర్ ఎన్టీఆర్కు మద్దతు పెరిగి.. పార్టీలో ముసలం పుట్టినా.. ఆశ్చర్యం లేదు. ఇక, కేసులు... కోర్టులు నారా లోకేష్కు షరా మామూలు కానున్నాయి. వైసీపీ నుంచి అడుగడుగునా అవమానాలు ఎదురు కానున్నాయి. ఎలా చూసుకున్నా నారా లోకేష్కు ఈ మనుటయా-మరణించుటయా.. అన్న పరిస్థితిని తీసుకురానుందనడంలో సందేహంలేదు.