అయితే.. ఈ ఫలితం.. మాత్రం వైసీపీకి పెద్ద పాఠమే కానుంది. ఎందుకంటే.. పార్టీ ఓడినా.. గెలిచినా.. ఓట్ల శాతం.. సీట్ల లెక్క కూడా ఆ పార్టీకి పాఠం కానుందని పరిశీలకులు చెబుతున్నారు. ఐదు సంవత్సరాల్లో అనేక అప్పులు తీసుకువచ్చి ప్రజలకు పందేరం చేశారు. అంతేకాదు.. నాడు నేడు పేరుతో అనేక మార్పులు చేశారు. విద్యార్థులకు యూనిఫాం ఇచ్చారు. అంతేకాదు.. ట్యాబులు ఇచ్చారు. ఆరోగ్య శ్రీలో అనేక సేవలు చేర్చారు. ఇంకా మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇవన్నీ నిజానికి .. ఇప్పటి వరకు ఎవరూ చేయలేదనే చెప్పాలి. ఇది ఒక్క జగనే చేశారని అనాలి.
మరి ఇంత జరిగినా ఆయన ఓడితే.. ఫలితం ఏంటి? ఆయనలో ఉన్న లోపం ఏంటి? ఎందుకు ఓడిపోయారనేది ప్రధాన ప్రశ్న. దీనికి కారణాలుకూడా కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నాలుగు సంవత్సరాలు.. సొంత ఎమ్మెల్యేలకు కూడా అప్పాయింట్ మెంటు ఇవ్వలేదు. ప్రజల మధ్యకు వచ్చింది లేదు. అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా.. పట్టించుకున్న పాపాన పోలేదు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం.. డాక్టర్ సుధాకర్ వ్యవహారం.. వంటివి తెరమీదికి వచ్చినప్పుడు.. వాటిని ఖండించడమో లేక.. వాటి వెనుక జరిగిన విషయాలు చెప్పడమో చేయలేదు.
ఇంకా.. ఇక్కడి తోనూ పరిస్థితి అయిపోలేదు. సొంత పార్టీ నాయకులపై కబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు కూడా.. స్పందించలేదు. ఇసుక విధానాన్ని మార్చినప్పుడు కూడా సీఎంగా ఆయన వివరణ ఇచ్చింది కూడా లేదు. సో.. ఇవన్నీ.. ఓటమికి కారణాలు. అంటే.. మొత్తంగా జగన్ జననేత కాలేదన్న సంకేతాలు ఇచ్చాయనే చెప్పాలి. ఇక, గెలిచినా.. కూడా జగన్కు అనేక పాఠాలు ఉన్నాయి. ఎందుకంటే.. అనేక సంక్షేమ పథకాలు చేసినా.. కూడా.. పూర్తిస్థాయిలో మెజారిటీ దక్కకపోవడం.. ప్రధాన పాఠంగా మారుతోంది. దీనికి కారణాలు ఏంటి? అనేది ఆయన ఆత్మశోధన చేసుకోవాలి. ఇప్పుడు అత్తెసరు మార్కులతో గట్టెక్కినా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే అనేక పాఠాలు ఆయనకు కళ్ల ముందు కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు.