జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీతో పాటు.. జగ్గయ్యపేట - పెనుగంచిప్రోలు - వత్సవాయి మండలాలు ఉన్నాయి. పోలింగ్కు ముందు ఉన్న సరళిని బట్టి చూస్తే గట్టి పోటీ ఉన్న తెలుగుదేశం అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య స్వల్ప మెజార్టీతో అయినా గట్టెక్కుతారని ఎక్కువ మంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. శ్రీరామ్ తాతయ్య చేతిలో వరుసగా రెండుసార్లు ఓడిన ఉదయభాను.. 2014లో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలలో కూడా మరోసారి గెలిచి లెక్క సరి చేయాలని ఆయన కసితో పని చేశారు. అయితే తాతయ్య మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వకూడదని గత ఎన్నికలలో తనను ఓడించిన భానుపై గెలిచే ప్రతికరం తీర్చుకోవాలని గట్టిగా కష్టపడ్డారు.
గత నాలుగు ఎన్నికల్లోనూ ఈ ఇద్దరు ప్రత్యర్థులే ముఖాముఖీ తలపడుతున్నా జగ్గయ్యపేటలో ఎప్పుడూ భారీ మెజార్టీలు లేవు. వీరిద్దరి మధ్య పోరు అయితే మామూలు మజాగా ఉండదు.. ఎంతో రసవత్తరంగా నడుస్తుంది. చివరి వరకు హోరాహోరీగానే ఉంటుంది. ఇక ఈ సారి కూడా రసవత్తరంగానే జరిగిన పోరులో అంతిమ విజేత గా శ్రీరామ్ తాతయ్య నిలిచారు. తాతయ్య 16 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇప్పటికే రెండు సార్లు గెలిచిన తాతయ్యకు ఇది మూడో విజయం.