ఇక ప్రతిపాడు నుంచి 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వరుపుల సుబ్బారావు ఈ ఎన్నికల్లోను వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దివంగత వరుపుల రాజా సతీమణి వరుపుల సత్యప్రభ టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. నియోజకవర్గంలో రాజకీయంగా కాపు సామాజిక వర్గం పూర్తిగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందినవారు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఎందుకో గాని ఇక్కడ టీడీపీకి మంచి పట్టు ఉన్నా కూడా 2014, 2019 రెండు ఎన్నికలలోను వైసీపీ స్వల్ప మెజార్టీతో విజయాలు సాధిస్తూ వస్తోంది.
అయితే ఈసారి వైసీపీ విజయాలకు తాము చెక్ పెడతామని కచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామన్న ధీమాతో ఆ పార్టీ నాయకులు అభిమానులు ఉన్నారు. చంద్రబాబు సైతం చిన్న వయసులోనే మృతి చెందిన రాజా సతీమణి సత్య ప్రభకు ముందుగానే టికెట్ ఇచ్చారు. కూటమి ప్రభావంతో పాటు జనసేన కాకినాడ పార్లమెంటుకు పోటీ చేయటం.. పక్కనే ఉన్న పిఠాపురం నుంచి పవన్ పోటీలో ఉండడం... కాపు సామాజిక వర్గం ఏకీకృతం కావడంతో.. ప్రతిపాడులో కచ్చితంగా కూటమి నుంచి పోటీ చేసిన సత్యప్రభ గెలుస్తారన్న అంచనాలు ముందుగా వినిపించాయి.
ఈ రోజు జరిగిన కౌంటింగ్లో సత్య ప్రభ ఏకంగా 38768 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి.. తన భర్తకు ఘనమైన నివాళిగా తన విజయాన్ని అర్పించారనే చెప్పాలి.