వాస్తవానికి గత ఎన్నికలలోనే జగన్ రాజమండ్రి పార్లమెంటులో బీసీ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈసారి కూడా గౌడ సామాజిక వర్గంలో ఉప కులం అయిన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్కు అవకాశం ఇచ్చారు. పురందరేశ్వరి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. మామూలుగా ఎన్టీఆర్ కుమార్తె ఇక్కడ పోటీలో ఉండడంతో కూటమి నేపథ్యంలో పురందరేశ్వరికి అనుకూలంగా వారు వన్ సైడ్ అవ్వాలి. అయితే పార్లమెంట్కు వచ్చేసరికి పురందరేశ్వరికి అనుకూలంగా అంత ఓటింగ్ జరగలేదన్న ప్రచారం గట్టిగా నడిచింది. పురంరేశ్వరి కూడా పూర్తిగా ప్రచారంపై దృష్టి సారించలేదు.
బీసీ ఓటింగ్ చీలిందని శెట్టిబలిజ సామాజిక వర్గం.. గౌడ ఉపకులాలు అన్ని వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు వేశాయని.. పార్లమెంట్కు వచ్చేసరికి వైసీపీకి అనుకూలంగా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్న టాక్ నేపథ్యంలో పురందరేశ్వరి గట్టి పోటీ ఎదుర్కొన్నారు అన్న నివేదికలు ఎక్కువగా వినబడ్డాయి. పురందేశ్వరి కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని ఎవరు అంచనా వేయలేకపోయారు. మామూలుగా కేంద్రమంత్రిగా పనిచేసిన పురందరేశ్వరి.. అటు పెద్దగా ఎవరికి తెలియని శ్రీనివాస్ మధ్య పోటీ అంటే పురందరేశ్వరి ఘనవిజయం సాధించాలి కానీ.. అనుకున్న స్థాయిలో ఎక్కడ పురందరేశ్వరి ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్లలేదు.
పైగా పార్లమెంటు పరిధిలో నిడదవోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తే అనపర్తిలో బీజేపి అభ్యర్థి పోటీలో ఉన్నారు. హోరాహోరీగా జరిగిన ఈ సమరంలో ఈరోజు జరిగిన కౌంటింగ్లో పురందేశ్వరి ఏకంగా 2 లక్షల ఓట్లతో విజయం సాధించారు. పూర్తి వివరాలు రాకుండానే పురందేశ్వరి ఆధిక్యం భారీగా ఉంది. ఇది మరింత పెరగనుంది. ఆమె కేంద్ర మంత్రి అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి.