మీరు విన్నది నిజమే. ఏపీలో రాజకీయంలో చాలా ఆసక్తికరమైన విష‌యం చోటు చేసుకుంది. తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న 4 మంది ఎమ్మెల్యేల‌కు ఒక ప్రాంతంతో అనుబంధం ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి ఎవరైనా ఒక ప్రాంతంలో జన్మించి అక్క‌డ ఉపాధి దొరక్కపోతే పొరుగు ప్రాంతాల‌కు లేదా పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లి జీవిస్తారు. అక్క‌డే స్థిర‌ప‌డ‌తారు కూడా. ఇది చాలా సర్వ సాధారణం. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన ఎందరో వ్య‌క్తులు హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చెన్నైల‌లో స్థిర‌ప‌డ్డారు. ఇక‌, పొరుగు దేశాల్లోనూ స్తిర‌ప‌డిన వారు కూడా అనేకమంది ఉన్నారనే విషయం అందరికీ తెలిసినదే.

అదేవిధంగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంతో అనుబంధం ఉన్న 4గురు నాయ‌కులు తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌య దుందుభి మ్రోగించారు. వీరికి కొండ‌పి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంతో గ‌త అనుబంధం ఉంద‌ని సమాచారం. విశాఖ జిల్లా భీమిలి నుంచి విజ‌యం ద‌క్కించుకున్న గంటా శ్రీనివాస‌రావుకు కూడా కొండ‌పితో అనుబంధం ఉంద‌ని తెలుస్తోంది. ఆయ‌న విద్యార్థిగా ఉన్న‌ప్పుడు అక్కడ ఉన్నార‌ని, వారి కుటుంబం చాన్నాళ్లు ఇక్క‌డే ఉంద‌ని సమాచారం. ఇక‌, పిఠాపురం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కి నెల్లూరు, గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల‌తో అనుబంధం ఉంద‌ని గతంలో ఆయన చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే.

ఈ కోవకే చెందుతారు.. ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న దామ‌చ‌ర్ల జ‌నార్ధ‌న్‌. ఆయన తాత, తండ్రి కూడా రాజకీయంగా కొండ‌పికి చెందిన వారు కావడం విశేషం. కొండ‌పి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంగా రిజ‌ర్వ్‌డ్ కాక‌ముందు.. దామ‌చ‌ర్ల తాత ఇక్క‌డ ప్ర‌జాప్ర‌తినిధిగా పనిచేసినట్టు తెలుస్తోంది. అలానే చీరాల నుంచి విజ‌యం ద‌క్కించుకున్న ఎం.ఎం. కొండ‌య్య యాద‌వ్ కూడా కొండపిలో జ‌న్మించిన వారు కావడం విశేషం. అదేవిధంగా కొండ‌పి నుంచి వ‌రుస‌గా రెండోసారి విజ‌యం ద‌క్కించుకున్న డాక్ట‌ర్ డోలా బాల వీరాంజ‌నేయ‌స్వామి స్వ‌స్థ‌లం ఇదే. ఇలా.. ఈ న‌లుగురు కూడా కొండ‌పితో అనుబంధం పెంచుకున్నారే కావ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: