పార్టీలకు అతీతంగా ఉన్న హీరో శివాజీ వంటివారు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. కూటమికి మద్దతు లభించిందని.. ఎక్కువ మంది కూటమికే మొగ్గు చూపించారని కూడా ఆయన తెలిపారు. దీంతో కూటమి పార్టీలు ఈదఫా విజయం దక్కించు కుంటాయని శివాజీ చెప్పుకొచ్చారు. ఇక, నానీ సహా మరికొందరు నటులు నేరుగా బయటకు చెప్పకపోయినా.. వారు కూడా కూటమి పక్షానే పనిచేశారు. మొత్తంగా. ఇండస్ట్రీలో పలువురు వేసిన అంచనాలు నిజమయ్యాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ వేసిన 160 సీట్ల అంచనా కూటమి విషయంలో పక్కాగా నిజమైంది.
దివంగత నటుడు చలపతిరావు తనయుడు, డైరెక్టర్ .. రవి బాబు కూడా.. కూటమి వైపు ప్రజలు ఉన్నారని తెలిపారు. ఏకంగా 150 సీట్లతో కూటమి విజయం దక్కించుకునేందుకు సిద్ధమైందన్నారు. ఈ విషయంలో తనకు డౌట్ లేదన్నారు. ఇది కూడా పక్కాగా నిజమైంది. ఇక, సినీ రంగానికే చెందిన ఒక కీలక నిర్మాత కూడా.. కూటమికి మద్దతుగా స్పందించారు. కూటమి విజయం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు చాలా వ్యూహాత్మకంగా తీర్పు ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈయన అభిప్రాయం కూడా సక్సెస్ అయింది.
వాస్తవానికి బయటకు చెప్పేందుకు ఎక్కువ మంది అప్పట్లో ముందుకు రాలేదు. అయితే.. అందరి అభిప్రా యంలోనూ కూటమి విజయం దక్కించుకుంటుందనే భావన వ్యక్తమైంది. చిత్రం ఏంటంటే.. మంచు ఫ్యామిలీ కూడా.. ఈ సారి కూటమి వైపు అంచనాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పింది. ఆన్ లైన్ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ మేరకు మంచు కుటుంబం అభిప్రాయం వ్యక్తం చేసింది. పైకి రాజకీయాలకు దూరంగా ఉన్నామని చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం కూటమి వైపు మంచు కుటుంబం ఉంది. ఇప్పుడు ఆ అంచనాలన్నీ.. నిజం కావడంతో టాలీవుడ్ హ్యాపీగా ఉండడం గమనార్హం.