- కమ్మ కోటాలో మనోహర్కు మంత్రి పదవి పక్కా
- కాపుల నుంచి పోటీ తీవ్రం...!
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
భారీ రేంజ్లో విజయం దక్కించుకున్న జనసేన పార్టీలో అంతే భారీ స్థాయిలో మంత్రి పదవులకు పోటీ పెరిగింది. కొందరికి ఎన్నికలకు ముందుగానే.. మంత్రి పదవులు ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్టు ప్ర చారం ఉంది. ప్రస్తుతం కూటమి సర్కారులో నలుగురి వరకు జనసేనకు చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది. వీరిలో ప్రధానంగా తెనాలి ఎమ్మెల్యేగా దశాబ్దకాలం తర్వాత.. విజ యం దక్కించుకున్న నాదెండ్ల మనోహర్ తొలి వరుసలో ఉన్నారు. మనోహర్ 2009 తర్వాత ఈ సారే గెలిచారు. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి స్పీకర్గా ఉన్నారు.
ఈయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని... ఇటు టీడీపీలోనూ.. అటు, జనసేనలోనూ కూడా చర్చ సాగుతోంది. ఇక, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున విజయం సాధించిన మండలి బుద్ద ప్రసాద్ కూడా.. ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. కాపులకు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా జనసేన పార్టీకి ఆది నుంచి కూడా.. కీలకంగా ఉన్న మరికొందరి పేర్లు కూడా.. మంత్రి వర్గం జాబితాలో ఉన్నాయి.
వీరిలో కందులు దుర్గేష్ పేరు వినిపిస్తుండడం గమనార్హం. నిడదవోలు నియోజకవర్గం నుంచి దుర్గేష్ విజయం దక్కించుకున్నారు. మెగా కుటుంబానికి విధేయుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయనకు మంత్రి పీఠం ఖాయమని చెబుతున్నారు. ఇక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం నుంచి విజయం దక్కించుకున్న బొలిశెట్టి శ్రీనివాస్ కూడా.. ఈ జాబితాలో ఉన్నారు. పార్టీ వాయిస్ వినిపించడంలో ఈ కుటుంబం ముందుంది. దీంతో మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు.
అలానే.. కాకినాడ నుంచి విజయం దక్కించుకున్న పంతం నానాజీ పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. ఈయన కూడా.. పార్టీకి కీలకమైన నాయకుడు. పైగా.. ఉమ్మడి తూర్పులో బలమైన పేరు కూడా ఉంది. దీంతో ఈయన కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక, ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి టికెట్ దక్కించుకున్న అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు కూడా.. పదవి ఖాయమని అంటున్నారు. కొణతాలకు బీసీ కార్డు ప్లస్ కానుంది. ఇక జనసేన నుంచి గెలిచిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం ఉంటుందంటున్నారు. ఎలా చూసుకున్నా.. లైన్లో 5-8 మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరికి అవకాశం చిక్కుతుందో చూడాలి.