- అమరావతి, ప్రత్యేకహోదా, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్ విషయంలో బాబుకు మంచి ఛాన్స్
( విశాఖపట్నం - ఇండియా హెరాల్డ్ )
కేంద్రంలో మరోసారి.. వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోడీ రెడీ అయ్యారు. అయితే.. ఈయన వరుసగా మూడోసారి తన కలను సాకారం చేసుకునేందుకు ఒంటరి బలం అయితే..సరిపోలేదు. ఏపీలో చంద్రబాబు కూటమి, బిహార్లో నితీశ్ పార్టీ జేడీయూలు కీలకంగా మారాయి. నితీశ్కు ఒంటరిగానే 12 మంది ఎంపీలు ఉన్నారు. తాజా ఎన్నికల్లో వారు విజయం దక్కించుకున్నారు. ఇక, చంద్రబాబు కూటమిగానే ఎన్నికల్లో పోటీ చేసినా.. ఆయన ఒంటరిగా.. 16 మంది ఎంపీలను గెలుచుకున్నారు. ఇప్పుడు వీరంతా కూడా.. మోడీకి బలంగా మారారు.
ఇక, కేంద్రంలో తమ మద్దతుతో ఏర్పడే ప్రభుత్వం వస్తే.. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, ఇతరత్రా నిధులు, పోలవరం ప్రాజెక్టు , కడప స్టీలు ప్లాంటు వంటివి సాధించేస్తామని.. గతంలో జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. ఆయనకు ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు చంద్రబాబుకు అవకాశం వచ్చింది. దీనిని ఆయన సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, విభజన హామీల అమలు వంటి వాటిలో ఎలా వ్యవహరిస్తారనేది కీలకంగా మారింది. ఆయా అంశాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయక పోతే.. మోడీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే.. మన రాష్ట్రం కన్నా.. బీహార్ మరిన్ని కష్టాల్లో ఉంది.
దీంతో చంద్రబాబు ఏమేరకు తన బలాన్ని అడ్డు పెట్టుకుని ఒత్తిడి చేసినా.. వెంటనే నితీశ్ కూడా అంతే బలంగా మోడీని తగులు కుంటారు. ఇది పెద్ద చిక్కు. ఇక, అలాగని ఒత్తిడి చేయకపోతే.. ఏపీలో రాజకీయంగా వైసీపీ నుంచి తీవ్ర ఎదురు దాడి ఎదురు కానుంది. కేంద్రంలో మద్దతు ఇచ్చి కూడా.. చంద్రబాబు రాజీ పడుతున్నారంటూ.. వైసీపీనాయకులు ఎదురు దాడి చేయడం ఖాయం. కేంద్రంలో కంటే కూడా.. ఏపీలో చంద్రబాబుకు మరిన్ని సెగలు పొగలు ఎదురు కానున్నాయి. ఈ పరిణామాలు ఇలా ఉంటే.. అటు నితీష్ను నమ్మే పరిస్థితి మోడీకి లేదు.
దీంతో కేంద్రంలోని పెద్దలు ప్రత్యామ్నాయం చూసుకునే అవకాశం ఉంది. రోజులు గడిచే కొద్దీ నితీష్తో తలనొప్పులు గతంలోనూ ఎన్డీయే కూటమి ఎదుర్కొంది. ఇక, ఇప్పుడు కూడా ఆయనను నమ్మే పరిస్థితి లేదు. ఇక, చంద్రబాబు విషయంలో సాఫ్ట్ కార్నర్ ఉన్నా.. ఆశించినంత మేరకు సాయం అందితే.. తమ సొంత రాష్ట్రాలైన గుజరాత్లో బీజేపీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో.. ఎలా చూసుకున్నా.. కేంద్రంలో ఇప్పుడే తన డిమాండ్లు వినిపించడం ద్వారా చంద్రబాబు తన పంథాను తెలియజేయాల్సి ఉంటుంది. లేటయ్యే కొద్దీ ఇది మరింత చిక్కుముడులకు దారి తీసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.