- పరాజయాన్ని విజయానికి గీటురాయిగా మార్చుకున్న వైనం
- 25 ఏళ్లుగా గెలవని చోట్ల బంపర్ విక్టరీలు
( గుంటూరు - ఇండియా హెరాల్డ్ )
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 2015లో బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్.. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వంలోనే మంత్రిగా సాగారు. ఆ కాలంలో ఆయన తెచ్చుకున్న పేరు కంటే.. ఎదుర్కొన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీనుంచి నిత్యం ఎదురు దాడులు.. విమర్శలు.. వంటివి పెరిగాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నించినా.. ఎదురుదాడి చేసినా పెద్దగా ఫలించింది కనిపించలేదు. కానీ, ఎప్పుడైతే.. యవగళం పేరుతో పాదయాత్రప్రారంభించారో.. అప్పటి నుంచినారాలోకేష్ రాజకీయంగా మలుపు తిరిగారు.
2023 జనవరిలో యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు.. అందరూ నవ్వారు. సొంత పార్టీలోనే పెదవి విరుపులు కనిపించాయన్నది నిష్టుర సత్యం. అయినప్పటికీ.. ముందుకు సాగారు అధికారంలో ఉన్న వైసీపీ అనేక ఇబ్బందులు సృష్టించింది. అయినప్పటికీ.. ముందుకే సాగారు. మధ్యలో నారా చంద్రబాబును అరెస్టు చేయడం.. కేసులు.. విచారణలు.. వంటివి మరింత గా పాదయాత్రపై ప్రభావం చూపించాయి. అయినా .. లోకేష్ విశ్రమించలేదు.
దీని తాలూకు ఫలితం.. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. పాదయాత్ర ము మ్మరంగా జరిగిన సీమ ప్రాంతాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. అసలు గెలుస్తుందా? లేదా.. అన్న నియోజకవర్గాల్లోనూ టీడీపీ విజయం దక్కించుకుంది. వాస్తవానికి యువగళం ఆయా నియోజకవర్గాల్లో పూర్తి అయి.. ఏడాది గడిచిపోయినా.. ప్రజలు మరిచిపోకుండా.. టీడీపీకి పట్టం కట్టారు. అప్రతిహత విజయం అందించారు. పాతికేళ్లుగా గెలవని నియోజకవర్గాల్లోనూ యువగళం టీడీపీకి గెలుపును ప్రసాదించింది.
ఈ పరిణామం.. నారా లోకేష్ సత్తాను మరింతగా చాటిచెప్పింది. ఎక్కడా వెనుకడుగు వేయని నైజం.. ముందుకే సాగిన తీరు వంటివి ఆయన నాయకత్వ పటిమను చాటి చెప్పాయి. ఎలా చూసుకున్నా.. ప్రతి అడుగు విజయం అందించిందనే చెప్పాలి. ప్రతి నియోజకవర్గం కూడా.. పాదాక్రాంతమైంది. టీడీపీని గెలిపించింది. ఈ విజయాన్ని మున్ముందు నిలబెట్టుకునేందుకు నారా లోకేష్ తన చాతుర్యాన్ని నాయకుల దూకుడును కూడా కనిపెట్టి.. ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అనడంలో సందేహం లేదు.