- శెట్టిబలిజ కమ్యూనిటీలో యంగ్ లీడర్ను ఎంకరేజ్ చేసే ప్లాన్
( గోదావరి - ఇండియా హెరాల్డ్ )
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం రామచంద్రపురం. ఇక్కడనుంచి తొలిసారి విజయం దక్కించు కున్న టీడీపీ నాయకుడు వాసంశెట్టి సుభాష్కు చంద్రబాబు మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో ఇదే జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు.. నిమ్మకాయల చిన్నరాజప్ప, బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, జ్యోతుల నెహ్రూ వంటి దిగ్గజ నాయ కులు ఆశ్చర్యపోయారు. వాస్తవానికి ఎన్నికలకు కొన్ని మాసాల ముందు వరకు వాసంశెట్టి వైసీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత.. ఆయనకు టికెట్ దక్కదని తెలిసి.. టీడీపీలోకి వచ్చి.. పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నారు.
కూటమి హవా నేపథ్యంలో సుభాష్ విజయం దక్కించుకున్నారు. మరి ఇలాంటి నాయకుడికి మంత్రి వర్గంలో చోటెలా పెట్టారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే.. ఇక్కడే చంద్రబాబు తన చతురతను ప్రశ్నించారు. ఒకప్పుడు రామచంద్రపురంలో టీడీపీకి దన్నుగా తోట త్రిమూర్తులు వున్నారు. దీంతో పార్టీ వెనుదిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా పోయింది టీడీపీని త్రిమూ ర్తులు కూడా బలంగా ముందుకు తీసుకువెళ్లారు.గత 2019 ఎన్నికల్లోనూ చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చారు. అయితే.. ఆఎన్నికల్లో ఓటమి తర్వాత త్రిమూర్తులు వైసీపీ బాటపట్టారు.
ఇదేసమయంలో రామచంద్రపురంలో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుటుంబం పుంజుకుంటోంది. తాజా ఎన్నికల్లోనూ పిల్లి కుమారుడు సూర్య ప్రకాశ్.. 71 వేలకు పైగా ఓట్లు దక్కించుకున్నారు. దీంతో ఎప్పటికైనా.. ఇక్కడ వైసీపీ పుంజుకునే అవకాశం అదేసమయంలో తోట త్రిమూర్తులు కూడా పుంజుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు లెక్కలు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా.. టీడీపీని బలోపేతం చేయడంతోపాటు.. వారికి పరోక్షంగా చెక్ పెట్టే ఉద్దేశంతోనే వాసం శెట్టికి తొలి దఫాలోనే మంత్రి పీఠం ఇచ్చినట్టు తెలుస్తోంది.
అంతేకాదు.. రామచంద్రపురంలో మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా.. పార్టీకి కూడా.. సంకేతాలు పంపించారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు.. కష్టపడేవారికి ఛాన్స్ తప్పకుండా వస్తుందన్న వ్యూహాన్ని కూడా చంద్రబాబు ప్లేచేశారని చెబుతున్నారు. మరోవైపు.. కీలకమైన నియోజకవర్గంలో పార్టీ పునాదులు కదిలిపోకుండా చూసుకునేందుకు.. ఇటు శెట్టిబలిజ కమ్యూనిటీలో పార్టీని స్ట్రాంగ్ చేసేందుకు వాసం శెట్టిని మరింత ప్రోత్సహించేందుకు కూడా.. ఈ పదవిని చంద్రబాబు వినియోగించుకున్నారనే చర్చ సాగుతుండడం గమనార్హం. ఏదేమైనా.. తొలిసారి విజయంతో మంత్రి పదవి దక్కించుకోవడం.. తూర్పు టీడీపీలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.