ఇలా కాంగ్రెస్ కి వచ్చిన ఓట్లు అన్నీ దాదాపుగా వైసీపీ నుండి చీలినవే అని వేరే చెప్పాల్సిన పనిలేదు. అవును, ఏపీ ప్రెసిడెంట్ గా వైఎస్ షర్మిల బరిలో దిగడంతో పాటు జగన్ కి ఆమె వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వైసీపీకి తీవ్ర నష్టం జరిగింది. దాంతో వైసీపీ ఓటు బ్యాంక్ తగ్గిపోయింది. నిజానికి వైసీపీకి 2014 నాటికి కూడా 45 శాతం ఓటు బ్యాంక్ ఉంది. కానీ ఆ గ్రాఫ్ కాస్త తగ్గి 39 శాతానికి పడిపోయింది. ఈ నేపధ్యంలో షర్మిల పీసీసీ చీఫ్ గా ఈసారి మరింత దూకుడు పెంచుతారు అని విశ్లేషకులు అంటున్నారు. ఆమె కేవలం మూడు నెలల కాలంలోనే తన సత్తా చాటుతూ వైసీపీకి దెబ్బ కొట్టారు. అదే ఆమె చేతిలో అయిదేళ్ల కాలం ఉంటే ఆమె ఎలాంటి ప్రభంజనం చూపిస్తారో ఆ దేవుడికెరుక.
ఈ నేపథ్యంలోనే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మరింతగా పుంజుకుంటే అది వైసీపీ ఉనికికే పెనుప్రమాదంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ అగ్ర నేతలను కలసి సంస్థాగతంగా కాంగ్రెస్ ని బలోపేతం చేస్తామని చెప్పినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఇక వైసీపీ అధినేత జగన్ కి యాంటీగా పీసీసీ చీఫ్ గా షర్మిలను కొనసాగించాలని కాంగ్రెస్ నిర్ణయించడం వెనక వ్యూహాలు మనం ఊహించుకోవచ్చు. మరోవైపు కేంద్రంలో చూస్తే ఈసారికి బీజేపీ సొంత మెజారిటీని సాధించలేకపోయింది. దాంతో 2029 నాటికి కాంగ్రెస్ కేంద్రంలో జెండా ఎగరవేయనుందనే అంచనాలు పెరిగిపోయాయి. కాబట్టి ఆ ప్రభావం ఏపీలో కూడా గట్టిగానే ఉంటుంది. మొత్తానికి షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నంతవరకూ వైసీపీకి జగన్ కి ఇబ్బందే అంటున్నారు విశ్లేషకులు.