ఏపీలో అధికారంలోకి వచ్చిన నిమిషం నుంచి కూటమి తెలివిగా అడుగులు వేస్తోంది. ఒకవైపు జగన్ చేసిన తప్పులను ఎత్తి చూపుతూనే మరోవైపు పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వైసీపీని చావు దెబ్బ తీసే ఏ అవకాశాన్ని వదులుకోకుండా కూటమి అడుగులు పడుతున్నాయి. అయితే విచిత్రం ఏంటంటే కూటమి నేతల విమర్శలకు జవాబులు, కౌంటర్లు ఇచ్చే నేతలు సైతం కరువయ్యారు.
 
వైసీపీ మాజీ మంత్రులలో కొందరు స్పందిస్తున్నా వాళ్లు తూతూమంత్రంగా స్పందిస్తున్నారే తప్ప మరీ ఘాటుగా స్పందిస్తున్న దాఖలాలు లేవు. మంత్రి పదవి కావాలని జగన్ ను టార్చర్ చేసిన మంత్రులు ఇప్పుడు నోరు మెదపడం లేదు. మరి కొందరు నేతలు ఛాన్స్ వస్తే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు. విమర్శలకు జవాబులు ఇవ్వడం కూడా చేత కాని నేతలకు జగన్ ఎందుకు పదవులు ఇక్ఛారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
వైసీపీ ఒక్కో మెట్టు పైకి ఎదిగి చివరకు మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఏపీలో ఒక విధంగా ప్రస్తుతం జనసేన కంటే వైసీపీ బలహీనమైన పార్టీ అని కొంతమంది భావిస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలంటే జగన్ మరింత బలంగా పోరాడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. వైసీపీ తర్వాత ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియాల్సి ఉంది.
 
కుటుంబ సభ్యులను జగన్ కలుపుకొని ముందుకు వెళ్తే మంచిది.. షర్మిల మద్దతు ఇవ్వకపోయినా సమస్య లేదు కానీ విమర్శించకుంటే అదే పదివేలు అని చెప్పవచ్చు. విజయమ్మ సైతం డైరెక్ట్ గా జగన్ కు మద్దతు ఇచ్చి ఉంటే బాగుండేది. కూతురికి మద్దతు ఇవ్వడం వల్ల విజయమ్మ ఏం సాధించారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీని ముందుకు నడిపించే నేతలకు జగన్ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. ఇప్పటినుంచే ప్రజలతో మమేకమవుతూ వైసీపీ కార్యకర్తలు, నేతలు ముందడుగులు వేస్తే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: