![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/pawankalyanfc70a25e-c706-411e-8432-cf81a383763a-415x250.jpg)
ప్రతి శాఖలో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధుల మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.సమీక్ష సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రివర్యులు బయలుదేరగా క్యాంపు కార్యాలయం వెలుపల వేచి ఉన్నవారిని చూసి వాహనం నిలిపారు.పి.ఆర్. ఇంజినీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పని చేస్తున్న మహిళలు తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు రావలసిన జీతాలు చెల్లించే ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరారు. ఈ విధంగా బాధపడుతున్నవారు 129మంది ఉన్నామని, పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య ఖర్చులకు కూడా ఇబ్బందులుపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.శాఖాపరమైన సమీక్షలు మొదలుపెట్టి, వివిధ పథకాల అమలు, నిధుల వినియోగంపై నివేదికలు పరిశీలిస్తున్నామని కచ్చితంగా ఈ అంశాన్ని చర్చిస్తామని హామీ ఇచ్చారు.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రహదారులు పాడైపోయిన తీరుపై చర్చించారు. ఏ మేరకు దెబ్బ తిన్నాయో, ఎంత కాలం నుంచి మరమ్మతులు చేయడం లేదో చెబుతూ, రోడ్ల కోసం కేటాయించిన నిధులను ఏం చేశారో తెలుపుతూ నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.ఏఐఐబీ నుంచి వచ్చిన రుణాన్ని వినియోగించుకోవడంలోనూ గత ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులు వేస్తే ఆ మొత్తాన్ని రీ ఎంబర్స్ చేస్తామని ఏఐఐబీ చెప్పిందని తెలిసి పవన్ ఆశ్చర్యపోయారు.పంచాయితీరాజ్ ఇంజినీరింగ్ విభాగం చేపట్టే పనులను సకాలంలో పూర్తి చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా, నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతున్నారా లేదా అని ప్రశ్నించారు. బ్లాక్ లిస్టులో ఉన్నవారికి ఏ విధంగా పనులు అప్పగిస్తున్నారు, ఆ జాబితాలో ఉన్నవారికి బిల్లులు చెల్లింపులు ఎలా చేశారో తెలుపుతూ వివరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు.