ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, విధానాలను సమీక్షిస్తూ.. సరికొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు తీపి కబురు అందించారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, సిబ్బందికి ఒక నెల జీతం గౌరవ వేతనంగా అందించాలని నిర్ణయించింది. 2024 సార్వత్రిక ఎన్నిక‌ల్లో పాల్గొన్న ఉద్యోగుల‌కు, సిబ్బందికి ఒక నెల గౌరవ వేతనం వేతనం ఇవ్వాల‌ని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేర‌కు ఏపీ సీఈవో అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు, సిబ్బందికి ఒక నెల గౌరవ వేతనం ఇవ్వాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు అమరావతి రాజధాని పరిధిలోని కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు 5 రోజుల పనివిధానాన్ని కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పనిదినాలు వారానికి ఐదు రోజులను మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఫైల్‌పై ఇప్పటికే సీఎం చంద్రబాబు సంతకం పెట్టగా, సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిన్నటి నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని సీఎస్‌ నీరభ్‌ కుమార్‌ తెలిపారు. 

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం మరో ఏడాది పొడిగించింది. సెక్రటేరియట్, హెచ్వోడీల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాలు అమలు చేయనున్నారు. ఐదు రోజుల పనివిధానం జూన్ 27తో ముగిసింది . అయితే ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం వినతితో ఈ గడువును మరికొంత కాలం పొడిగింపునకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు మరో ఏడాది వారానికి ఐదు రోజుల పనివిధానం కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన సీఎంకు సచివాలయ సంఘం ధన్యవాదాలు తెలిపింది.ఏపీ విభజన తర్వాత సచివాలయాన్ని అమరావతికి తరలించిన నేపథ్యంలో సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్‌కు వెళ్లి వచ్చేందుకు వీలుగా వారానికి ఐదు రోజుల పనివిధానం అమలు చేశారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే పనిచేసేలా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని కొనసాగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: