- విజయవాడ వేదికగా తానే వైఎస్సార్ వారసురాలినని బల ప్రదర్శన
- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో జగన్ ఓటు బ్యాంకుకు గండి తప్పదా ?
( రాయలసీమ - ఇండియా హెరాల్డ్ )
ఎన్నికలకు ముందు ఏపీలో కీలక విషయం తెరమీదికి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులు ఎవరు? జగనా.. నేనా..? అంటూ.. ఆయన కుమార్తె, కాంగ్రెస్ పార్టీ ఏపీ అద్యక్షురాలు.. వైఎస్ షర్మిల ప్రజల మధ్యకు వచ్చారు. అంతేకాదు.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురానివారిని, రైతులకు మేలు చేయని వారిని, వైఎస్ ప్రతిష్టాత్మకంగా భావించిన సాగునీటి ప్రాజెక్టుల్లో ఒక్క దానిని కూడా పూర్తి చేయని వారిని ఎలా వారసులుగా పేర్కొంటారంటూ.. ఆమె విమర్శలు గుప్పించారు.
ఇదే సమయంలో తానే అసలు సిసలు వారసురాలినని కూడా చెప్పారు. ఇక, వైఎస్ వివేకానందరెడ్డి హత్యను కూడా.. ఈ సందర్భంగా ప్రస్తావించారు. సొంత బాబాయిని దారుణంగా హత్య చేయించిన వారికి కొమ్ము కాసేవారు... వైఎస్ వారసులు అవుతారా ? అంటూ.. నిలదీశారు. మొత్తంగా వైఎస్ వారసత్వంపై పెద్ద ఎత్తున చర్చకు తెరదీశారు. కట్ చేస్తే.. వైసీపీ ఓడిపోయింది. దరిమిలా.. పెద్దగా కనిపించని షర్మిల.. అప్పుడప్పుడు.. ఇప్పటి కి మూడు సార్లు స్పందించారు.
తాజాగా వైఎస్ వారసత్వ పోరును మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే నెల 8వ తేదీన వైఎస్ 75వ జయంతి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆలంబనగా చేసుకుని.. తానే వైఎస్ కు అసలు సిసలు వారసురాలినని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ వేదికగా అంగరంగ వైభవంగా.. వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించేందుకు షర్మిల సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా.. ఆమె వైఎస్ వారసత్వ పోరును తీవ్రస్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇక, ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని వైఎస్ అభిమానులను, అనుచరులను కూడా.. ఆహ్వానిస్తున్నారు. తద్వారా ఆయా సామాజిక వర్గాల ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా.. తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో షర్మిల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరి దీనికి వైసీపీ కౌంటర్ ఇస్తుందా? అనేది ప్రశ్న. ఇవ్వకపోతే.. కొంపమునుగుతుందని అంటున్నారు పరిశీలకులు.