తాజా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి అందరికీ తెలిసినదే. దేశంలో మరే పార్టీ ఓడిపోని విధంగా వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. 175కి 175 సీట్లు గెలుచుకుంటాం అని నమ్మబలికిన వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. కాగా ఎన్నికలు జరిగే క్రమంలో ఈవీఎంల ధ్వంసం ఘటన ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటన పై వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈక్రమంలో నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లిని గురువారం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు.

ఈ క్రమంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ... పిన్నెల్లి ఏదో ఆవేశంలో పొరపాటున చేసిన దానికి తనని అరెస్ట్ చేయడం తగదని, టీడీపీ వారు కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించడం జరిగింది. కాగా జగన్  చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు స్పందిస్తూ కౌంటర్లు ఇస్తున్న సంగతి తెలిసినదే. ఇక తాజాగా ఇదే అంశంపైన జనసేన నేత కొణిదెల నాగబాబు వైఎస్ జగన్ మాటలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

కాగా పిన్నెల్లికి కోపమొచ్చి ఈవీఎం పగులగొట్టారన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలపై తాజాగా జనసేన నేత నాగబాబు సెటైర్లు వేయడం జరిగింది. ఆయన జగన్ వ్యాఖ్యలను ఉద్దేశించి స్పందిస్తూ... "ఏం మాట్లాడుతున్నారండి? ఓడిపోతామనే భయంతో పిన్నెల్లి అంతటి దుశ్చర్యకు పాల్పడితే, మాజీ సీఎం అయినటువంటి జగన్ దానిని సమర్ధించడం చాలా దురదృష్టకరం. ఈ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసినప్పటికీ వైసీపీలో మార్పు ఏమాత్రం కనబడడం లేదు. మిడిమిడి జ్ఞానంతో మితిమీరిన ఎచ్చులకి పోయినందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇకనైనా పరిణతితో మాట్లాడకపోతే ఈ సారి డబల్ డిజిట్ కాస్తా సింగిల్ డిజిట్ అయిపోయే ప్రమాదం దాపురిస్తుంది... జాగ్రత్త జగన్!" అని నాగబాబు ఓ మీడియా వేదికగా మాట్లాడడంతో ఇపుడు వైసీపీ వర్గంలో పెను దుమారమే చెలరేగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: