- ఏ విషయంలో ప్రశ్నించక పోవడం వెనుక అంతర్యం ఏమిటి.?
- ప్రతిపక్ష కర్తవ్యాలు మర్చిపోతున్నారా..?
వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పట్టుకొని ఎదిగినటువంటి నేత. దాదాపు తన తండ్రి మరణించిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి జైలుకు వెళ్లి ఆ తర్వాత పాదయాత్ర చేసి ప్రజల మద్దతు పొంది 2019లో అద్భుత మెజారిటీతో గెలుపొందారు. అలాంటి జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓ స్థాయిలో నిలిపారని చెప్పవచ్చు. రాజకీయ ఉద్దండుడైనటువంటి చంద్రబాబు నాయుడుకే చుక్కలు చూపించినటువంటి వ్యక్తి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఏమైంది. ఒక్కసారి ఓటమి రాగానే తట్టుకోలేకపోతున్నారా.?తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోతున్నారా.? చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే వివరాలు చూద్దాం..
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారా.?
జగన్మోహన్ రెడ్డి 2019లో 150కి పైగా అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అంతేకాదు ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో దాదాపుగా 90% పైగా నెరవేర్చారు. అయినా జగన్ మోహన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. దీనికి ప్రధాన కారణం ఆయనకు ఉన్నటువంటి అహంకార భావం, ఒకటైతే తన చుట్టూ ఉన్నటువంటి నేతలు స్థాయిని మరిచి మాట్లాడడం, పనులు చేయడం. దీంతో ప్రజలు విసుగు చెంది పూర్తిగా జగన్ ను ఓడించాలనుకున్నారు. అయినా జగన్ మోహన్ రెడ్డికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 40 శాతానికి పైగా ఓట్ షేరింగ్ వచ్చింది.. ఒకవేళ చంద్రబాబు కూటమితో కలవకుంటే మాత్రం తప్పక జగన్మోహన్ రెడ్డి విజయం సాధించే వారేమో. ఇంతటి ప్రజా ఆదరణ ఉన్న జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం సైలెంట్ అయిపోయారు. ఆయన సైలెంట్ అయితే ఆయన నమ్మి ఓట్లేసినటువంటి 40 శాతం మంది ప్రజలను మోసం చేసినట్టే అవుతుంది.