మద్యం, ఏపీ ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్మెంట్, అమరావతి అసైన్డ్ భూములు, ఇసుక, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ సహా కేసులు నమోదైనట్టు పిల్ దాఖలు చేసారు. ఈ కేసుల్ని నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు కోసం.. సీబీఐ, ఈడీలకు అప్పగించాలని సీనియర్ జర్నలిస్ట్ బాల గంగాధర తిలక్ ఈ పిల్ దాఖలు చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల అనంతరం అప్పుడు డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగానికి తాళాలు వేయించారని పిల్లో పేర్కొనడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతందని గమనించి.. ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
చంద్రబాబు సహా ఇతరులపై నమోదైన కేసుల్లో.. సీఐడీ, ఈడీ ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల దర్యాప్తును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఇట్టి పరిస్థితుల్లో హైకోర్టు ఈ కేసులన్నింటి దర్యాప్తును సీబీఐ, ఈడీకి అప్పగించాలని ఏపీ హైకోర్టును కోరారు తిలక్. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ అప్పటి ఎండీ హోదాలో డి.వాసుదేవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మద్యం కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగారని గుర్తు చేసారు. ఇక తమపై ఫిర్యాదు చేసిన వారందరిపై రెడ్బుక్ అంటూ అధికారులను బెదిరిస్తున్నారని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీ దర్యాప్తును పర్యవేక్షించాలని పిల్లో హైకోర్టును కోరారు.