కృష్ణాజిల్లా, గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్‌ తగిలింది. ఏపీ బ్రోవరేజస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, గత కృష్ణా జిల్లా జెసి ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. వాసుదేవ రెడ్డి, కొడాలి నాని అతని అనుచరులు, తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్. ఇక ప్రభాకర్ ఫిర్యాదు మేరకు వాసుదేవ రెడ్డి, కొడాలి నాని, వైకాపా కీలక నేతలు దుక్కీపాటి శశి భూషణ్, కసుకుర్తి బాబ్జి, పాలడుగు రాంప్రసాద్, కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై 448,427,506 r/w 34 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.


ఈ సందర్భంగా ఫిర్యాదిదారుడు దుగ్గిరాల ప్రభాకర్ మాట్లాడుతూ... 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరుపై మేము ఏపీ బ్రోవరేజెస్  లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందామని తెలిపారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.... పద్మా రెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు.... బ్రోవరైజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, మాధవిలత రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని సహకారంతో ప్రయత్నించారని ఆరోపణలు చేశారు. కొడాలి నాని అనుచరులు తమపై బెదిరింపులకు దిగారని.... తమ గోడౌన్ లో ఉన్న లిక్కర్ కేసులను పగల కొట్టి తగలబెట్టారని వివరించారు.



ఈ విషయమే పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేం అన్యాయమని తన తల్లి సీతా మహాలక్ష్మి....వాసుదేవ రెడ్డితో ఫోన్లో మాట్లాడగా ఆయన పచ్చి బూతులు తిట్టారన్నారు.  ఈ వ్యవహారంపై జేసీ మాధవి లతా రెడ్డికి ఫిర్యాదు చేసినా..... ఆమె కూడా దుర్భషలాడారని పేర్కొన్నారు. ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే మనస్థాపంతో తన తల్లి మరణించిందని.... తమపైనే ఫిర్యాదు చేస్తావ అంటూ  అప్పట్లో కొడాలి నాని అనుచరులు కొందరు తనకు ఫోన్లు చేసి బెదిరించారని ఆరోపణలు చేశారు.


తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశానని.... ఫిర్యాదు చేసిన తర్వాత వైసిపి నేతల పేర్లు ఎందుకు పెట్టావంటూ రాత్రంతా కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి బెదిరింపులతో నాకు ప్రాణ భయం పట్టుకుంది.... తనకు రక్షణ కల్పించాల్సిందిగా సిఎం చంద్రబాబు... ఐటీ శాఖ మంత్రి లోకేష్ లకు నేడు లేఖ రాస్తానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: