- పేదోన్ని ఆదుకోవడమే తన ధ్యాస.
- ఢిల్లీలోనే వణుకు పుట్టించిన ధీరుడు రాజశేఖర్..
వైయస్ రాజశేఖర్ రెడ్డి..ఈయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ఉంటుంది. డాక్టర్ గా సేవలందించిన రాజశేఖరుడు రాజకీయ నాయకుడిగా అరంగేట్రం చేసి కోట్లాదిమందికి భరోసా ఇచ్చాడు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించే విధంగా పాలన చేశాడు. ఆయన ఒక నాయకుడిగా కాకుండా ప్రతి పేదోడి ఇంట్లో దైవంగా పూజింపబడ్డాడు. మంచి వారికి తొందరగా చావు వస్తుందనే సామెతకు బ్రాండ్ వైయస్సార్. అలాంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర మొదలుపెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని తిరుగులేని విధంగా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఏదో వచ్చామా పోయామా అనే విధంగా కాకుండా ఢిల్లీ పెద్దలతో కొట్లాడి దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలు తీసుకువచ్చారు. అలాంటి రాజశేఖరుడు తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా మారాడు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలేంటి.. పేదలకు ఎంత న్యాయం జరిగింది అనే వివరాలు చూద్దాం.
పేద ప్రజల దేవుడు:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1460 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందారు. ఈ సమయంలో ఆయన ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు చూశాడు. పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతున్నారో తెలుసుకొని చలించి పోయాడు. అనారోగ్యం బారిన పడిన ప్రజలు వైద్యం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కళ్ళ ముందు కట్టినట్టు పాదయాత్రలో చూడగలిగాడు. ఇలా ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటన్నింటిని తీర్చడం కోసం చివరికి కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చి సీఎం గా పీఠాన్ని అధిరోహించారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి 2004లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయి అధికారంలోకి తీసుకువచ్చి సీఎం అయ్యారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత కరెంటు పై సంతకం పెట్టారు. ఉచిత కరెంట్ అనేది అప్పటి రైతులకు ఎంతగానో ఉపయోగపడిందని చెప్పవచ్చు. అంతే కాకుండా పేద విద్యార్థుల చదువు కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చాడు. పేదల ఆరోగ్యం కోసం 108,104 లను ప్రతి గ్రామంలోకి అందుబాటులోకి తెచ్చాడు.