ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అజెండాను ఖరారు చేయనుందని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హత్యా రాజకీయాలు,దాడులు, దౌర్జన్యాల గురించి వైసీపీ ప్రధానంగా ఫోకస్ పెట్టనుందని తెలుస్తోంది.
 
జగన్ కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాల గురించే ఎక్కువగా మాట్లాడనున్నారని సమాచారం అందుతోంది. ప్రభుత్వమే హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం గురించి జగన్ నిలదీయనున్నారని భోగట్టా. మరోవైపు కూటమి సర్కార్ నాలుగు నెలల ఓటాన్ బడ్జెట్ కు సభలో ఆమోదం ద్వారా కాలయాపన చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు పొలిటికల్ వర్గాల్లో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం వల్ల సూపర్ సిక్స్ హామీల అమలు మరింత ఆలస్యం కానుందని సమాచారం అందుతోంది. మరోవైపు చంద్రబాబు శ్వేతపత్రాల విడుదల ఎత్తుగడతో వైసీపీని ఇబ్బంది పెట్టాలని భావిస్తుండటం గమనార్హం. ఆర్థిక, ఎక్సైజ్, శాంతి భద్రతల పేరుతో శ్వేతపత్రాలను రిలీజ్ చేయాలని టీడీపీ భావిస్తుండగా ఇందుకు సంబంధించి వైసీపీ కౌంటర్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
 
మరోవైపు కూటమి ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. అధికార వర్గాల అంచనాల ప్రకారం ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 24 లేదా 25 తేదీలలో ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో అసెంబ్లీకి హాజరు కానున్నారని భోగట్టా. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరగనున్నాయో అనే చర్చ మాత్రం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం సృష్టిస్తే జగన్ కే నష్టమనే వాదన సైతం వినిపిస్తుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: