కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం టీడీపీలో ఆదిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేత పెత్తనం చెలాయించాలని చూస్తున్నాడు. ఇక మిగిలిన నేతల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ బరిలో నిలిచాడు. వైసీపీ ప్రత్యర్థి విరూపాక్షపై స్వల్ప తేడాతో వీరభద్ర గౌడ్ ఓటమి పాలయ్యారు. కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు.


దీంతో తెలుగు తమ్ముళ్లలో విపరీతమైన జోష్ పెరిగింది. కానీ ఆలూరులో వీరభద్ర గౌడ్ ఓటమి టీడీపీలో నిరూత్సాహానికి గురిచేసింది. మరోవైపు వైసీపీ కంచుకోటలో తెలుగుదేశం కూటమి హవా ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి ఓడిపోవడం గమనార్హం. అయితే టీడీపీ అభ్యర్థిపైన ఉన్న వ్యతిరేకతతో అక్కడ టీడీపీ ఓడిపోయినట్లు చెబుతున్నారు. మరోవైపు ఓటమి షాక్ నుంచి టీడీపీ నేతలు బయటపడక ముందే నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి కోసం నేతలంతా ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి వచ్చింది.

ఈ వార్త పార్టీలో చిచ్చు రేపుతోంది...పార్టీలోని ఓ వర్గం వీరభద్ర గౌడ్ ను సపోర్ట్ చేస్తుంటే... మరో వర్గం వ్యతిరేకత చూపిస్తోంది. రీసెంట్ గా చిప్పగిరి మాజీ జెడ్పిటిసి మీనాక్షి నాయుడు తన అనుచర వర్గంతో భారీ కాన్వాయ్ తో ఆలూరు నుంచి కర్నూలు చేరుకొని జిల్లా టీడీపీ అధ్యక్షుడు దిక్కారెడ్డిని కలిశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వీరభద్ర గౌడ్ నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగించోద్దని కోరడం తెలుగుదేశం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.


ఓడిపోయిన నేతకు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వస్తుందని మీనాక్షి నాయుడు చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కోరారట. ఓడిపోయిన నేతకు ఎందుకు పెత్తనం అని ప్రశ్నించినట్లు సమాచారం. మరి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం టీడీపీలో ఆదిపత్య పోరుపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: