ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడిన తర్వాత నూతన మద్యం పాలసీ రూపకల్పన పై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త విధానం అమలుపరచడానికి వివిధ రాష్ట్రాలలో కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. ముఖ్యంగా ఆరు రాష్ట్రాలలో అధ్యయనం చేయడానికి అధికారులతో కూడిన నాలుగు బృందాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు రాజస్థాన్, తెలంగాణ , ఉత్తరప్రదేశ్ , తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్ళనున్నారు. ఆయా రాష్ట్రాలలోని ఎక్సైజ్ పాలసీ ,మద్యం షాపులు , లిక్కర్ ధరలు, మద్యం కొనుగోలు, బార్లు , మద్యం నాణ్యత , డిజిటల్ పేమెంట్ వంటి అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయబోతున్నాయి.

అంతేకాదు అక్రమ వైద్యం నివారణ , డ్రగ్ కంట్రోల్ పై కూడా ఈ అధికారుల బృందం అధ్యయనం చేయనుంది. ట్రాక్ అండ్ ట్రేస్, డి అడిక్షన్ సెంటర్ల నిర్వహణ వంటి అంశాల పైన దృష్టి సారించనున్నారు.  ఆయా రాష్ట్రాలలోని అత్యుత్తమ విధానాలపై కూడా ప్రభుత్వానికి ఈ బృందాలు నివేదిక ఇవ్వనున్నాయి. ఆగస్టు 12వ తేదీలోగా ఈ బృందాలు నివేదికలు సమర్పించాలని నాలుగు అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత అన్ని అధ్యయనాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక చేస్తోందని సమాచారం.

ముఖ్యంగా రాష్ట్రంలో మద్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,  శాశ్వతంగా పరిష్కరించడం కుదరదు కాబట్టి కొన్ని నియమాలతో కూడిన కొత్త అమలును తీసుకురానున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రజలకు హాని కలగకుండా, ప్రభుత్వానికి ఆదాయం తగ్గకుండా పలు జాగ్రత్తలు తీసుకోబోతున్నారట.ఈ మేరకు పలు అంశాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ విధానం మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లో అమల్లోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: