వైసిపి పార్టీకి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి ఢిల్లీ రాజకీయాలలోని అన్ని పార్టీలతో మంచి పరిచయాలు ఉన్న వ్యక్తిగా అందరికీ తెలిసిందే. ఈయన తాజాగా హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఆగస్టు 1వ తేదీన తాను కేంద్ర హోం మంత్రిని కలిసినట్లు విజయసాయిరెడ్డి ఎక్స్ ద్వారా ట్వీట్ చేయడంతో ఈ విషయాలు కాస్త వెలుగులోకి వచ్చాయి. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను చర్చించినట్లుగా స్పష్టం చేశారు. ఇక బిజీ షెడ్యూల్ లో కూడా తనకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కి విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

అయితే ఇలా వారం రోజుల వ్యవధిలోనే విజయ్ సాయి రెడ్డి రెండవసారి అమిత్ షాను కలవడంతో పార్టీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరుస భేటీల తర్వాత అసలు ఏం జరుగుతోందనే ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి. అమిత్ షా తో వరుస భేటీలు ఎందుకు? ఏమిటి? అన్న విషయాలు బయటకు తెలియకపోయినా పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. విజయ్ సాయి రెడ్డి బిజెపి గూటికి చేరుతారని పుకార్లు మరింత వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

వైసీపీలో కీలక నేతగా జగన్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బిజెపి వైపు వెళ్తారా అన్నదే ఇప్పుడు అంతటా సాగుతున్న చర్చ. ఒకవేళ ఇదే గనుక జరిగితే జగన్ కి ఇంతకంటే పెద్ద షాక్ మరి ఎక్కడ ఉండదేమో అని అప్పుడే అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే జూలై 24వ తేదీన విజయసాయిరెడ్డి ఢిల్లీలో వైసిపి నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమి ఎంపీలను,  కీలక నేతలను తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించారు.  దీంతో పాటుగా ఇండియా కూటమిలో వైసిపి చేరుతుందని జాతీయస్థాయిలో మీడియా కోడై కూసింది. మరొకవైపు బిజెపి నుంచి ఏ ఒక్కరు ఈ ధర్నాకు రాకపోవడం,  ఎన్డీఏకు బద్ధ వ్యతిరేక పార్టీలు హాజరు కావడం పైగా జగన్ కూడా వారితోనే గడపడంతో డౌట్లు ఎన్నో ఎక్కువయ్యాయి. ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇండియా కూటమికి అనుకూలంగా ఉన్న విజయసాయిరెడ్డి వంటి వారు ఇప్పుడు బీజేపీతో కలవడంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం.  మరి అమిత్ షాను విజయసాయిరెడ్డి కలవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: