విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో పొలిటికల్ టెంపరేచర్ పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నిక ఆగస్టు 30వ తేదీన జరుగుతుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది. స్థానిక సంస్థల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. అయితే మారుతున్న సమీకరణాల దృష్ట్యా రాజకీయం ఆసక్తికరంగా మారింది.


ఈ ఎన్నికల్లో జీవీఎంసీ కార్పొరేటర్లు.....యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో కలిపి మొత్తం 841 ఓట్లు ఉండగా..... అందులో వైసీపీ బలం 615 కాగా టీడీపీ, జనసేన, బీజేపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి. ఇక 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీ కంటే మూడు రేట్ల సంఖ్యాబలం విశాఖ స్థానిక సంస్థల్లో వైసీపీకి ఉంది. అయితే జీవీఎంసీలో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించి టీడీపీ, జనసేనలో చేరారు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం వలసలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రమే కూటమి అభ్యర్థిని దీటుగా ఎదుర్కొనగలరని భావించి ఆయనను బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం. ముందుగా మాజీ మంత్రి అమర్నాథ్ పేరును అనుకున్న చివరకు బొత్స పేరును ఖరారు చేశారు. ఇక కూటమి తరపున టీడీపీ నేత గండి బాబ్జి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న బాబ్జి ఎమ్మెల్యేగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే బాబ్జికి సముచిత స్థానం కల్పిస్తామని టీడీపీ హైకమాండ్ అప్పట్లో ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక రేసులో రెండవ స్థానంలో ఉన్న సీతం రాజు సుధాకర్ గతంలో వైసీపీలో పని చేశారు. అప్పట్లో వైసీపీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కూడా దిగారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. విశాఖ సౌత్ టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. ఇక అనకాపల్లి నుంచి (గౌడ) సామాజిక వర్గానికి చెందిన పీల గోవింద్ పేరు కూడా వినపడుతోంది. ఆయన కూడా కూటమి పొత్తులో తన సీటును త్యాగం చేశారు. ఇక సీనియర్ నేత వీరభద్రరావు, మైనార్టీ నేత నజీర్లు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: