విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఇప్పటికే వైసీపీ తరఫున ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స‌ సత్యనారాయణ పేరును వైసీపీ అధినేత జగన్ ఖరారు చేశారు. వాస్తవానికి ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు బొత్స కు ఇష్టం లేదు. అయితే జగన్ సీనియార్టీని అడ్డం పెట్టడంతో బొత్స అయష్టంగానే బరిలోకి దిగుతున్నారు. అయితే ఇప్పుడు కూటమి కూడా బొత్స కు ధీటైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. అనకాపల్లి టిడిపి నేత పీలా గోవిందతో పాటు పెందుర్తి నేత గతంలో పరవాడ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గండి బాబ్జి కూడా ఎమ్మెల్సీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.


వీరిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసి బొత్స ను ఢీకొట్టగలిగే అభ్యర్థిగా కూటమి ఫైనల్ చేయనుంది. గత ఎన్నికలలో వైసీపీ తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది.. అందుకే గతంలో టిడిపి పోటీ పెట్టలేదు. అయితే వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ ఎన్నికలలో జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.. అయితే ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి.. వైసిపి బలం ఎంత అన్నది క్లారిటీ లేదు.


అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా విశాఖ వైసిపి నేతలు అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ కారణంగానే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి ఎమ్మెల్సీ గెలుచుకోవడం అంత సులువు కాదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఘోరమైన ఓట‌మి తర్వాత రెండు నెలలలోనే బొత్స కు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. అయితే వైసిపి మాత్రం బొత్స తన చాణక్యంతో గెలిచి ఎమ్మెల్సీ అవుతారని .. వైసిపి పరువు నిలుపుతారని ఆశలు పెట్టుకుంది. అయితే అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ తో పాటు విశాఖ జిల్లాకు చెందిన కూట‌మి పార్టీల‌ నేతలు అందరూ ఎలాగైనా ఇక్కడ బొత్స‌ను ఓడించి కూటమి అభ్యర్థి ఘ‌న‌ విజయం సాధించాలని విశ్వ‌ ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: